హైదరాబాద్ : భారీ వర్షాల నేపథ్యంలో హిమాయత్ సాగర్కు వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు 4 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సోమవారం ఒక గేటును మాత్రమే ఎత్తి నీటిని విడుదల చేయగా, మంగళవారం ఉదయం మరో మూడు గేట్లను ఎత్తేశారు. హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1760 అడుగుల వద్ద ఉంది. ఇన్ ఫ్లో 1200 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 1320 క్యూసెక్కులుగా ఉంది.
ఉస్మాన్ సాగర్కు కూడా వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు 6 గేట్లను ఆరు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1787 అడుగుల వద్ద ఉంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 2,400 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 2,442 క్యూసెక్కులుగా ఉంది.
హుస్సేన్ సాగర్కు కూడా వరద ఉధృతి కొనసాగుతోంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 మీటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 513.48 మీటర్ల వద్ద ఉంది.