కవాడిగూడ, జూన్ 8 : మత్స్యకార వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది కుటుంబాల్లో వెలుగులు నింపాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మహిళా మత్స్యకారులు ఆర్థిక స్వావలంబన సాధించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తున్నదని చెప్పారు. గురువారం ఎన్టీఆర్ స్టేడియంలో రాష్ట్ర మత్స్య శాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించే ఫుడ్ ఫెస్టివల్ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, పశు సంవర్ధక శాఖ ప్రత్యేక చీఫ్ సెక్రటరీ ఆధార్ సిన్హా, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరామ్తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో మత్స్యరంగం అభివృద్ధికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. మత్స్యకారులకు ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నదన్నారు. మృగశిర కార్తె సందర్భంగా మహిళా మత్స్యకారులు చేపలు, రొయ్యలతో చేసే వివిధ రకాల వంటకాలను ప్రజలకు అందుబాటులోకి తేవాలని సీఎం ఆదేశాల మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో సుమారు 800 స్టాల్స్ను ఏర్పాటు చేశామని వివరించారు. ఇప్పటికే మత్స్య శాఖ ఆధ్వర్యంలో సుమారు 600 మంది మహిళా మత్స్యకారులకు వివిధ రకాల వంటకాలపై శిక్షణనిచ్చామని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని వివిధ సొసైటీల్లో నూతనంగా 18 సంవత్సరాలు నిండిన అర్హులైన లక్ష మంది మత్స్యకారులకు సభ్యత్వాలు అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వెయ్యికోట్లతో మత్స్యకారులకు ద్విచక్ర వాహనాలు, ట్రాలీ ఆటోలు, ట్రక్కులను సబ్సిడీపై అందించిన విషయాన్ని గుర్తు చేశారు. చెరువులపై పూర్తి హక్కులు మత్సకారులకే కల్పించినట్లు తెలిపారు. రాష్ట్రంలో రూ.7 వేల కోట్ల విలువైన మత్స్య సంపద ఉత్పత్తి జరుగుతుందని, రానున్న రోజుల్లో దేశానికి, ఇతర దేశాలకు చేపలను ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ మత్స్యకారులు ఎదుగుతారన్నారు. అంతకుముందు అన్ని స్టాల్స్ని సందర్శించి చేపలు, రొయ్యలతో చేసిన ఫ్రై, బిర్యానీ, పకోడి, పులుసు తదితర వంటకాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, కవాడిగూడ కార్పొరేటర్ రచన శ్రీ, మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి, మత్స్యశాఖ అధికారులు మురళి, సుధాకర్, చరితా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.