అగ్నిమాపక సిబ్బంది సేవలు అనిర్వచనీయం
విపత్తులు, ప్రమాదాల్లో విధి నిర్వహణ కీలకం
శాంతిభద్రతలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం
హోంశాఖ మంత్రి మహమూద్అలీ
తెలంగాణ ఫైర్ ఫైటర్స్ 5కే రన్ ప్రారంభం
ఖైరతాబాద్, ఏప్రిల్ 20 : విపత్తులు, అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలకు తెగించి బాధితులను రక్షిస్తారని, విధి నిర్వహణలో వారి సేవలు వెలకట్టలేనివని హోంశాఖ మంత్రి మహమూద్అలీ అన్నారు. పౌర సమాజంలో ప్రజలు కూడా పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సహకరించాలని కోరారు. డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా బుధవారం నెక్లెస్రోడ్ పీవీ మార్గ్లోని పీపుల్స్ప్లాజా వద్ద ‘తెలంగాణ ఫైర్ ఫైటర్స్’ 5కే రన్ నిర్వహించారు. ఈ పరుగును హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా, రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ శాఖ డైరెక్టర్ లక్ష్మీప్రసాద్, అదనపు డైరెక్టర్ జీవీ నారాయణరావు, రీజినల్ ఫైర్ ఆఫీసర్ ప్రసన్నకుమార్, యశోద హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ లింగయ్యతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు.
అగ్నిమాపకశాఖ విధులు చాలా కీలకమైనవని, విధి నిర్వహణలో సిబ్బంది తెగించి పనిచేస్తారని గుర్తుచేశారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ హోంశాఖకు చాలా ప్రాధాన్యమిచ్చారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2020లో 7899 అగ్ని ప్రమాదాలు, 2021లో 7149 ఘటనలు జరిగాయని, గతంతో పోల్చితే ప్రమాదాలు కొంత తగ్గాయని తెలిపారు. అగ్ని ప్రమాదాలపై అవగాహన ముఖ్యమని, ఇందులో భాగంగానే అగ్నిమాపకశాఖ ఫైర్ సర్వీస్ వీక్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శాఖ డైరెక్టర్ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ గతేడాది విధి నిర్వహణలో రవీంద్ర మిశ్రా, బాలు దాము దేశ్ముఖ్లు అనే ఫైర్ ఆఫీసర్లు మృతిచెందారని, వారి త్యాగం మరువలేనిదన్నారు. తెలంగాణ ఫైర్ సర్వీసెస్కు గడిచిన ఏడాది కాలంలో 7,141 కాల్స్ వచ్చాయని, 30 మందిని రక్షించామని, రూ.1,500 కోట్ల సొత్తును కాపాడినట్లు చెప్పారు.
ప్రతిభకు గుర్తింపు
బెస్ట్ ఫైర్స్టేషన్గా కరీంనగర్ డివిజన్ మొదటి స్థానం, రెండో స్థానంలో నల్గొండ డివిజన్, మూడో స్థానంలో గౌలిగూడ నిలిచాయి. ఉత్తమ ఫైర్ ఆఫీసర్గా చంద్రశేఖర్బాబు (పంజాగుట్ట) మొదటి, శ్రావణ్ (సిద్దిపేట) ద్వితీయ, ఎన్.మల్లేశ్ (మల్కాజిగిరి) తృతీయ బహుమతులు అందుకున్నారు. వీరితోపాటు లీడింగ్ ఫైర్మన్లుగా దేవేందర్రెడ్డి (గద్వాల), కె.సత్యనారాయణ (సికింద్రాబాద్), మహ్మద్ గులాం యజ్దాని (ఆదిలాబాద్), డ్రైవర్ ఆపరేటర్లుగా జె.రవి (సికింద్రాబాద్), శివాజీ (హుజూర్నగర్), సురేందర్ (వరంగల్), బెస్ట్ ఫైర్మన్ అజయ్కుమార్ (ఆదిలాబాద్), టి.సత్యం (వరంగల్), కె.శేఖర్ (యాదాద్రి) మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు.
బోరుబావిలో పడితే…
గ్రామీణ ప్రాంతాల్లో తెరిచివున్న బోరుబావుల్లో ప్రమాదవశాత్తు చిన్నారులు పడిపోతుంటారు. వారిని రక్షించేందుకు, బోరు బావిలో వారి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు తెలంగాణ అగ్నిమాపకశాఖ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ‘విక్టిమ్ లొకేటింగ్ కెమెరా’ను తమ అమ్ములపొదిలో చేర్చింది. బ్యాటరీ, విద్యుత్తో నడిచే ఈ పరికరానికి అనేక ప్రత్యేకతలున్నాయి. ప్రత్యేక అమరికతో నేరుగా బోరుబావిలోకి దీన్ని పంపించి అందులో ఉన్న బాధితుడితో మాట్లాడవచ్చు. అందుకు ప్రత్యేకమైన స్పీకర్, రిసీవర్, సెన్సార్లు ఉన్నాయి. అధిక మెగాపిక్సల్ కలిగి 360 డిగ్రీలు తిరిగే సామర్థ్యం కలిగిన కెమెరాతో లోపలున్న బాధితుడి పరిస్థితిని అంచనా వేయవచ్చు. 120 మీటర్ల వరకు బోరుబావిలో పరిస్థితిని చూడవచ్చు.
విన్యాసాలు అదరహో
అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు సిబ్బంది చూపించే తెగువ, కాపాడే విధానాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. వారు నిర్వహించిన విన్యాసాలు అబ్బురపరిచాయి. గ్యాస్ ప్రమాదాలు, ఇళ్లు దగ్ధమైనప్పుడు రెస్క్యూ ఆపరేషన్లు, మంటలను ఆర్పేందుకు ఫైరింజన్ల ద్వారా నీటి పిచికారీ, క్షతగాత్రులను అంబులెన్సులో తరలించడం లాంటి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
అందుబాటులో ఆధునిక పరికరాలు
తెలంగాణ అగ్నిమాపకశాఖ మారుతున్న కాలానుగుణంగా ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నది. అగ్ని, ఇతర ప్రకృతి వైపరీత్యాలు జరిగిన క్రమంలో నూతన పరికరాలు సమకూర్చుకుంది. ఆ పరికరాలను ఈ కార్యక్రమంలో ప్రదర్శనగా ఉంచారు. ఇంట్లో ఇరుక్కుపోయినప్పుడు డోర్ బ్రేకర్, శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు న్యూమాటిక్ లిఫ్టింగ్ ఎయిర్బ్యాగ్, దట్టమైన పొగలో ఉన్నప్పుడు నిర్వహించే ఆపరేషన్ కోసం బ్రీతింగ్ అపారటస్ సెట్, కాంక్రీట్ కట్టర్ లాంటి యంత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.