సిటీబ్యూరో, జనవరి 17 (నమస్తే తెలంగాణ)/మేడ్చల్ కలెక్టరేట్ : అగ్ని ప్రమాద సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చని జీహెచ్ఎంసీ ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్రెడ్డి తెలిపారు. ఈ నెల 12 నుంచి 17వరకు ఈవీడీఎం ఆధ్వర్యంలో ఆర్సీ పురం డీమార్ట్, కూకట్పల్లి చెన్నై షాపింగ్ మాల్, అత్తాపూర్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ఎస్డి రోడ్ భవన మల్టీస్టోరేజ్ కాంప్లెక్స్, ఎల్బీనగర్ లక్ష్మీ పద్మశాలీ హ్యాండ్లూమ్ అండ్ టెక్ట్స్టైల్ మార్కెట్తో పాటు 19 చోట్ల అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తూ మాక్డ్రిల్ నిర్వహించినట్లు తెలిపారు.
భవన నిర్మాణ వ్యర్థాలను తరలిస్తున్న వాహనాలపై చర్యలు తీసుకున్నామని, పార్కింగ్ పాలసీకి విరుద్దంగా ఉన్న 26 వ్యాపార సంస్థలపై చర్యలు తీసుకున్నట్లు ఈవీడీఎం అధికారులు తెలిపారు. ఈవీడీఎం సేవలపై 040-29555500, 9000113667 నంబర్కు వాట్సాప్ చేయాలని తెలిపారు. ఇదిలా ఉంటే మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లో బుధవారం అదనపు కలెక్టర్ విజయేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో 10వ బెటాలియన్ డిజాస్టర్ ఫోర్స్ సీబీఆర్ఎం మాక్ డ్రిల్ నిర్వహించింది. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ దామోదర్ సింగ్, ఇన్స్పెక్టర్ గౌతమ్ కుమార్ బృందం, డీఆర్వో హరిప్రియ, తదితరులు పాల్గొన్నారు.