వెంగళరావునగర్, జూన్ 4: అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమా దం సంభవించింది. అమీర్పేట్ మైత్రీవనం సమీపంలోని వెస్ట్ శ్రీనివాస్ నగర్ కాలనీలోని మూడంతస్తుల భవనంలోని రెండో ఫ్లోర్లో ఉన్న హెల్మెట్ బజార్ దుకాణంలో గురువారం మధ్యా హ్నం 12.30 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. క్షణాల్లోనే మంటలు వాణిజ్య సముదాయంలోని మూ డంతస్తులకు వ్యాపించాయి. ఉవ్వెత్తున మంటలు ఎగసిపడటంతో దుకాణాల నిర్వాహకులు, సిబ్బంది, కొనుగోలుదారులు భవనం మెట్ల మార్గం ద్వారా పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు.
అయితే ఈ క్రమంలో కొంత తోపులాట జరగటంతో కొందరికి స్పల్ప గాయాలయ్యాయి. కాంప్లెక్స్ లోని దాదాపు 20 దుకాణాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. మూడు అంతస్తుల భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లో ట్రావెల్ ఏజెన్సీ దుకాణాలు, ఓ మొబైల్ దుకాణం, మెదటి, రెండో అంతస్తులో హెల్మెట్లు విక్రయించే హెల్మెట్ బజార్, కేఎస్ఆర్ ఫ్యాషన్స్ పేరిట వస్త్ర దుకాణం, బొమ్మల దుకాణం ఉన్నాయి. అవన్నీ అగ్నికి ఆహుతయ్యాయి.
షాపింగ్ కాంప్లెక్స్ నుంచి వచ్చే దట్టమైన పొగ కొద్ది దూరంలోనే ఉన్న అమీర్పేట్ మెట్రో కారిడార్ పైకి వ్యాపించాయి. దీంతో మొట్రో రైళ్లను కొద్దిసేపు నిలిపివేశారు. ప్రమాద ఘటనలో ఎలాం టి ప్రాణానష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 7 ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకొని మూడుగంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ క్రమంలో అమీర్పేట్ నుంచి ఎస్.ఆర్.నగర్ వైపునకు రాకపోకలు సాగించే రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ స్తంభించింది.
జిల్లా అగ్నిమాపక అధికారులు ఎ.శ్రీదాస్, వెంకన్న జిల్లా సహాయక అగ్నిమాపక అధికారులు సురేష్ రెడ్డి, దుర్గా ప్రసాద్, యుగంధర్ ప్రసాద్, అదనపు డీసీపీ శ్రీకాంత్, ఏసీపీ రాఘవేంద్రరావు, ట్రాఫిక్ ఏసీపీ కట్టా హరిప్రసాద్తో పాటు మధురానగర్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ సంఘటన స్థలం వద్ద పరిస్థితిని పర్యవేక్షించారు. కాగా అగ్ని కీలలు భారీగా ఎగిసి పడటంతో ధాటికి మెట్రో పిలర్ల కింద ఉన్న తాగునీటి పైప్లైన్ కాలిపోవడంతోపాటు మెట్రో పిలర్ల కిందిభాగంలో పెచ్చులు ఊడిపోయాయి. ఎల్అండ్టీ అధికారులు పరిస్థితిని సమీక్షించారు.
ఉవ్వెత్తున ఎగసిపడుతున్న మంటలను ఆర్పడానికి అధికారులు మర మనిషి(రోబో)ని వినియోగించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన రోబో అగ్నికీలలు ఆర్పివేయడంలో విశేషంగా పనిచేసింది.
అగ్ని ప్రమాద ఘటనలో నష్టపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు. అమీర్పేట్లో ప్రమాదం ఘటనాస్థలిని సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదాలు నివారించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుకూడా లేదని, వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే సకాలంలో స్పందించిన అధికారులను తలసాని అభినందించారు.