Bus Accident | కుత్బుల్లాపూర్, ఏప్రిల్15: నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సును రోడ్డు పక్కన నిలిపివేసి, అందులో ఉన్న 30 మంది ప్రయాణికులను కిందకు దింపారు. ఈ ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. హైదరాబాద్ నుంచి రాయ్పూర్కు ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెళ్తున్నది. మార్గమధ్యలో కొంపల్లి చౌరస్తా డ్లైట్ కిచెన్ సమీపానికి చేరుకోగానే బస్సులో నుంచి కాలిన వాసన రావడంతో.. డ్రైవర్ అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కన ఆపాడు.
వెంటనే అందులో ఉన్న 30 మంది ప్రయాణికులను కిందకు దింపాడు. మంటలు చెలరేగి డీజిల్ ట్యాంక్కు అంటుకోవడంతో ఒక్కసారిగా భారీగా శబ్దం వచ్చింది. స్థానికులు, ప్రయాణికులు సంఘటనా స్థలం నుంచి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న జీడిమెట్ల ఫైర్ స్టేషన్ సిబ్బందితో పాటు స్థానిక ట్రాఫిక్, సివిల్ పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని మంటలు ఆర్పి వేశారు. అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు.
ఈ ప్రమాదంపై ప్రయాణికులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు ముందే ప్రయాణికుల సీట్ల వద్ద ఉండే ఛార్జింగ్ పాయింట్లు షార్ట్సర్క్యూట్కు గురయ్యాయని, ప్రయాణికులు వెంటనే బస్సు డ్రైవర్ను అప్రమత్తం చేయడంతో కరెంటు సరఫరా అయ్యే మెయిన్ బాక్స్ను ఆఫ్ చేశాడని ప్రయాణికులు తెలిపారు. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండటం వల్లే పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. ట్రావెల్స్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా బస్సు కండిషన్లో లేదని, అందువల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు