Madapur | కొండాపూర్, జూన్ 6 : మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై వేగంగా వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో కారు మొత్తం మంటలు వ్యాపించి దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఏలాంటి గాయాలు కాలేదు.
పోలీసులు తెలిపిన ప్రకారం.. శుక్రవారం సాయంత్రం 4.15 గంటల సమయంలో మియాపూర్కు చెందిన శ్రీరాంరెడ్డి హోండా కారు (ఏపి09సిఏ1878)లో ఇనార్బిట్ మాల్ వైపు నుంచి కేబుల్ బ్రిడ్జి మీదుగా జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45 వైపు వెళ్తున్నాడు. కారు కేబుల్ బ్రిడ్జి మీదకు చేరుకోగానే ఇంజిన్లో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే కారును రోడ్డుపై నిలిపివేసి అందులో ఉన్న ఇద్దరు బయటకు వచ్చారు. క్షణాల్లో కారులో మొత్తం మంటలు వ్యాపించాయి. స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో, మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు కేబుల్ బ్రిడ్జి మీదకు చేరుకొని ట్రాఫిక్ను మళ్లించారు. ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు.
కారు ఇంజిన్లో ఎలక్ట్రికల్ సమస్యతో ఈ అగ్నిప్రమాదం సంభవించిందని పోలీసులు తెలిపారు. ఐటీ ఉద్యోగులు ఇండ్లకు వెళ్లే సమయం కావడంతో ఐకియా నుండి రోడ్డు నెంబర్ 45 రూట్లో ట్రాఫిక్ జాం ఏర్పడింది. ప్రమాదానికి గురైన కారుపై సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ, వరంగల్ కమిషనరేట్ల పరిధిలో 17 ట్రాఫిక్ చలాన్లు ఉన్నాయి. ఓవర్ స్పీడ్తో కారు డ్రైవింగ్ చేయడం, నో పార్కింగ్ జోన్లో కారును పార్కింగ్ చేయడం వంటి చలాన్లు ఎక్కువగా ఉన్నాయి. 2019 నుండి ఇప్పటి వరకు ఈ కారుపై రూ.11490 ఫైన్ పెండింగ్లో ఉంది.