కవాడిగూడ, మే 7: గాంధీనగర్ ఎస్బీఐ కాలనీలోని ఎలక్ట్రికల్ వాహనాల సర్వీసింగ్ సెంటర్లో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రేకుల షెడ్డులో కొనసాగుతున్న విద్యుత్ వాహనాల సర్వీసింగ్ సెంటర్లో ఎండవేడిమి ఎక్కువై ప్రమాద వశాత్తు ఒక బ్యాటరి ఉన్నఫలంగా పేలడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగక పోవడంతో ఎస్బీఐ కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు. దాదాపు పదిలక్షల రూపాయల ఆస్తినష్టం జరిగినట్లు షెడ్డు నిర్వాహకులు, పోలీసులు పేర్కొంటున్నారు. ఎస్బీఐ కాలనీలోని వాజ్పాయి స్టేడియం సమీపంలో సత్యనారాయణ అనే వ్యక్తి కొంత కాలంగా స్పెక్ట్రో ఓల్డ్ మొబిలిటి సర్వీసింగ్ సెంటర్ను ఏర్పాటు చేసి బ్యాటరీ మెకానిక్ షాపును నిర్వహిస్తున్నాడు.
గురువారం మెకానిక్లు విధులు నిర్వహిస్తుండగా మధ్యాహ్నం ఎండవేడిమిని తట్టుకోలేక సర్వీస్సెంటర్లో ఉన్న బ్యాటరీ ఒక్కసారిగా పేలిపోయి షెడ్లో మంటలు అంటుకున్నాయి. సర్వీసింగ్ సెంటర్లోని బ్యాటరి సైకిళ్లు, ఎలక్ట్రికల్ వాహనాలు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, గాంధీనగర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని రెండు ఫైరింజన్ల సహాయంతో మంటలు ఆర్పివేశారు. ఈ సందర్భంగా షాపు నిర్వహకుడు సత్యనారాయణ మాట్లాడుతూ అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో దాదాపు పదిలక్షల రూపాయల ఆస్తినష్టం జరిగిందని కన్నీళ్లు పెట్టుకున్నాడు. బాధితల ఫిర్యాదు మేరకు గాంధీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి: బీఆర్ఎస్ యువ నాయకుడు ముఠా జయసింహ
అకస్మాత్తుగా జరిగిన అగ్నిప్రమాదంలో పూర్తిగా నష్టపోయిన సర్వీసింగ్ సెంటర్ నిర్వాహకులను ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్ఎస్ యువనాయకుడు ముఠా జయసింహ కోరారు. ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలసి ప్రమాదం జరిగిన స్థలాన్ని సందర్శించారు. బాధితులను పరామర్శించిన ఆయన అగ్నిప్రమాదనికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొంత కాలంగా ఎలక్ట్రికల్ వాహనాల సర్వీసింగ్ సెంటర్ను కొనసాగిస్తున్నారని ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంలో అది పూర్తిగా కాలి బూడిదయ్యాయని..నిర్వాహకులు పూర్తిగా నష్టపోయారన్నారు. బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన మోకానిక్ అసోసియేషన్ ప్రతినిధులు సైతం బాధితులను ఆదుకుని న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.