సిటీబ్యూరో, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : సమాజంలో ఫొటో జర్నలిస్టుల పాత్ర ఎంతో గొప్పదని, భాష లేకుండానే చిత్రం (ఫొటో) విషయాన్ని చేరవేస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో తెలంగాణ ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు జి.భాస్కర్ అధ్యక్షతన తెలంగాణ ఫొటో జర్నలిస్టులకు ఛాయాచిత్ర బహుమతుల ప్రదానోత్సవం ఆదివారం రవీంద్రభారతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి హరీశ్రావు హాజరై, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణతో కలిసి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మట్లాడుతూ అద్భుతమైన ఫొటో తీయడంలో మీరు పడే తపన, చేసే కృషి గొప్పదని అన్నారు. ఒక విషయాన్ని ఇతరులకు చెప్పేందుకు భాష అవసరం కానీ, ఎలాంటి భాషా అవసరం లేకుండా చిత్రం విషయాన్ని చేరవేస్తుందని, సమాజంలో ఫొటో జర్నలిస్టుల పాత్ర ఎంతో గొప్పదని పేర్కొన్నారు. ఒక్క ఫొటో చరిత్రను తిరగరాయడమే కాదు.. చరిత్రను సృష్టిస్తుందని చెప్పారు. సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. ఫొటోజర్నలిస్టులు తీసిన ఒక్కో ఫొటో ఎన్నో భావాలను వెలికితీస్తుందని చెప్పారు. ఒక సన్నివేశాన్ని అర్థవంతంగా ప్రజలకు చేరవేయడంలో కీలకంగా పనిచేస్తారని ఇది వారికున్న గొప్పతనమని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ వెలుగు నీడలతో వేసే పెయింటింగ్ ఫొటోగ్రఫీగా అభివర్ణించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు పత్రికల ఫొటో జర్నలిస్టులు హాజరయ్యారు.
అభివృద్ధి సంక్షేమాన్ని సమాజానికి చూపండి
రాత్రి, పగలు తేడా లేకుండా కష్టపడి, కాలంతో పోటీపడి పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తున్నదని మంత్రి హరీశ్రావు చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని మీ ఫొటోల ద్వారా సమాజానికి తెలియజేసి ఆయా సంక్షేమ పథకాలు, కార్యక్రమాల ద్వారా ప్రజలు లబ్ధిపొందేలా చూడాలని కోరారు. గతంలో అక్రెడిటేషన్పై ఫొటో జర్నలిస్టు అని ఉండేదని, ప్రస్తుతం ఫొటోగ్రాఫర్ అని జారీ చేశారని.. ఈ సమస్యను మీడియా అకాడమీ చైర్మన్తో చర్చించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఫొటో జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని జాతీయ స్థాయి అవార్డులు అందుకోవాలని ఆకాంక్షించారు.
మీడియాను, జర్నలిస్టులను కాపాడుకుంటాం
జర్నలిస్టులందరితో సీఎం కేసీఆర్కు ఎంతో సన్నిహిత సంబంధం ఉందని అలాంటి మీడియాను, జర్నలిస్టులు, ఫొటో జర్నలిస్టులను కాపాడుకునే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం భుజానికి ఎత్తుకున్నదని మంత్రి హరీశ్రావు వివరించారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ.100కోట్ల కార్పస్ ఫండ్ను ప్రభుత్వం ప్రకటించడంతోపాటు కరోనా బారిన పడిన జర్నలిస్టులకు రూ.6కోట్ల ఆర్థిక సాయాన్ని అందించిందని పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా జర్నలిస్టుల నైపుణ్యాలు పెంచేందుకు తెలంగాణ స్టేట్ మీడియా అకాడమీ కృషి చేస్తున్నదని, 22వేల మందికి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా చికిత్స సర్జరీల కోసం రూ.32కోట్లు ఖర్చుపెట్టినట్లు వెల్లడించారు.
ఉద్వేగాలకు ప్రతిబింబంగా..
మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ ఒక్క ఫొటో వెయ్యి పేజీల సారాంశాన్ని బోధిస్తుందని, ఉద్వేగాలకు ప్రతిబింబంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ జీవన చిత్రానికి నిలువెత్తు నిదర్శనంగా ఇక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శన ఉన్నదని, ఎంతో కష్టపడి తీసిన చిత్రాలు అద్భుతంగా ఉన్నాయని ఫొటోజర్నలిస్టులను అభినందించారు.
ఉద్యమంలో జర్నలిస్టులది గొప్ప పాత్ర
తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు గొప్ప పాత్ర పోశించారని, లాఠీలు, ముళ్ల కంచెలను దాటుకొని నిర్బంధ పరిస్థితులను కండ్లకు కట్టేలా చూపెట్టారని మంత్రి హరీశ్రావు గుర్తు చేశారు. ప్రాణాలు తెగించి మీరు తీసిన ఫొటోలు ఎన్నో ఉన్నాయని, మిమ్మల్ని తెలంగాణ సమాజం మర్చిపోదన్నారు. ఉద్యమ చరిత్ర గతం కావొచ్చు, కానీ మీరు తీసిన ఫొటోలు రేపటికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయని చెప్పారు.