బంజారాహిల్స్, సెప్టెంబర్ 12: ఫిలింనగర్లో గ్యాస్ లీకేజీ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళ సైతం చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో మృతుల సంఖ్య రెండుకు చేరింది. సోమవారం తెల్లవారుజామున ఫిలింనగర్ పీఎస్ పరిధిలోని మహాత్మాగాంధీనగర్ బస్తీలో గ్యాస్ లీకేజీ కారణంగా మంటలు చెలరేగడంతో మిర్యాల రమేశ్ దుర్మరణం చెందగా.. అతడి భార్య శ్రీలత(32)తో పాటు ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీలత మంగళవారం మధ్యాహ్నం మృతి చెందింది. కాగా, వీరి కుమారుడు హర్షవర్ధన్ పరిస్థితి కూడా విషమంగా మారడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. తల్లిదండ్రులిద్దరూ మరణించడంతో ఉస్మానియాలో చికిత్స పొందుతున్న ఇద్దరి పిల్లలను చూసేవారు లేకపోవడంతో విలవిలలాడుతున్నారు.
మహాత్మాగాంధీనగర్ బస్తీలోని వాంబే గృహసముదాయంలో పదేళ్లుగా నివాసముంటున్న మిర్యాల రమేశ్ (38) కార్ డ్రైవర్. సుమారు 15 ఏండ్ల పాటు ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో కారు డ్రైవర్గా పనిచేశాడు. ఏడాది కిందట అక్కడ ఉద్యోగం మానేసిన తర్వాత సొంతంగా కారు కొనుక్కుని ప్రైవేటు సంస్థలో ఎంగేజ్ పెట్టాడు. అతడి భార్య శ్రీలత(32). కుమారుడు హర్షవర్దన్, కూతురు సీతామహాలక్ష్మి. ఆదివారం రాత్రి ఇంటికి వచ్చిన రమేశ్ భోజనం చేసిన తర్వాత పిల్లలు, భార్యతో కలిసి గదిలో నిద్రపోయారు. అయితే వంటింట్లోని స్టవ్కు సంబంధించిన రెగ్యులేటర్ను ఆఫ్ చేయడం మర్చిపోయారు. గ్యాస్ పైప్ లీకేజ్ ఉన్న విషయాన్ని కూడా గమనించలేదు. దీనికి తోడు దోమల బెడద కారణంగా అన్ని కిటికీలు మూసే ఉంచారు. రాత్రంతా లీక్ అయిన గ్యాస్ గదిలో నిండిపోయింది. ఉదయాన్నే నిద్రమత్తులో లైట్ ఆన్ చేయడంతో స్పార్క్కు ఒక్కసారిగా మంటలు చెలరేగి రమేశ్తో పాటు శ్రీలత, హర్షవర్దన్, సీతామహాలక్ష్మి గాయపడ్డారు.
తమ వద్ద సుమారు 15 ఏళ్లుగా ఎంతో నమ్మకంగా పనిచేసిన రమేశ్తో పాటు అతడి భార్య అగ్ని ప్రమాదంలో మృతిచెందడం ఎంతో బాధాకరమని ఎంపీ రంజిత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రమేశ్ పిల్లలను ఎంపీ రంజిత్రెడ్డి పరామర్శించారు.