మేడ్చల్, ఫిబ్రవరి 21 : ప్రేమికులను విధి విడదీసింది.. రెప్పపాటులో వారి జీవితాల్లో చీకట్లు నింపింది. శామీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందగా, యువతి తీవ్రంగా గాయపడింది. పోలీసుల కథనం ప్రకారం.. వెస్ట్మారేడ్పల్లిలో నివాసముండే ప్రేమికులు.. బుధవారం ఉదయం శామీర్పేటకు ద్విచక్రవాహనంపై వచ్చారు.
ఎంతో సరదాగా తిరిగి వెళ్తున్న క్రమంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన పాల ట్యాంకర్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లింగప్ప అలియాస్ విక్కి(24) తల చిధ్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనంపై వెనుక కూర్చొన్న యువతికి తీవ్ర గాయాలయ్యాయి. కండ్ల ముందే తను ప్రేమించిన వాడు.. విగతజీవిగా మారడంతో ఆమె హతశురాలైంది. యువతిని సకాలంలో గాంధీకి తరలించడంతో ప్రాణాలు దక్కాయి.