చిక్కడపల్లి, మే 26 : వ్యక్తులు, కుటుంబాల మాదిరిగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆర్థిక క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఉన్నదని లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఇండియన్ బ్యాంక్స్ రిటైరీస్ అసోసియేషన్(ఏపీ, తెలంగాణ) దైవార్షిక సమావేశం గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
గోధుమల ఎగుమతిని నిషేదిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతులు రూ.80వేల కోట్లు నష్టపోయారని తెలిపారు. యూపీఐ ద్వారా బ్యాంకులకు సంబంధం లేకుండానే లావాదేవీలు జరుగుతున్నాయని, ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆల్ ఇండియా బ్యాంక్ రిటైరీస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఎం.దేశ్పాండే మాట్లాడుతూ పెన్షన్ అప్డేట్ త్వరలో అమలులోకి వస్తుందన్నారు. ఇండియన్ బ్యాంక్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ కేఎస్ సుధాకర్ రావు, తెలంగాణ బ్యాంక్ రిటైరీస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఎ.రాజేంద్ర ప్రసాద్, ఆర్.లక్ష్మణ్ రావు, ఎల్లారావు వీరారెడ్డి, మస్తాన్, ముళ్ల పూడి వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.