ఘట్కేసర్ రూరల్, ఫిబ్రవరి 8: ఆర్థిక ఇబ్బందుల కారణంగా పురుగుల మందు తాగి తన భర్త ఆత్మహత్యకు పాల్పడినట్లు నమ్మించిన భార్య, ఆమె ప్రియుడే హంతకులుగా పోలీసులు భావించి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలోని అవుషాపూర్కు చెందిన షేక్ మౌలానా(43) ఈ నెల 5న గుర్తు తెలియని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి మంగళవారం మృతి చెందిన విషయం తెలిసిందే. అదే రోజు రాత్రి అంత్యక్రియలు చేసేందుకు యత్నించగా.. అతడి భార్యపై అనుమానం వచ్చిన బంధువులు అంత్యక్రియలు జరుగకుండా అడ్డుకున్నారు.
బుధవారం మధ్యాహ్నం అంత్యక్రియలు జరిపే ముందు బంధువులు నిలదీయటంతో అసలు విషయం తెలిపినట్లు తెలిసింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా మృతుడి భార్య, ఆమెను ప్రోత్సహించిన మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. మృతుడు మౌలానా సంవత్సరం కిందట వరకు బతుకుదెరువు కోసం దుబాయి వెళ్లాడు. దీంతో అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలిసింది. ఇద్దరు కలిసేందుకు భర్త అడ్డు రావటంతో ఇటీవల ప్రియుడు నీ భర్తను చంపేయాలని వత్తిడి తీసుకురావటంతో అంగీకరించి అతడు ఇచ్చిన పరుగుల మందు కలిపిన మద్యం సీసాను భర్తచే తాగించింది. పురుగుల మందు తాగిన మౌలానా వాంతులు చేసుకుని కడుపు నొప్పితో బాధ పడుతుండగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు నమ్మించి గాంధీ దవాఖానకు తరలించింది. స్థానికులు, బంధువులకు అనుమానం వచ్చి నిలదీయడంతో అసలు విషయం బయట పడింది. మౌలానా హత్యపై పోలీసులు విచారణ చేపట్టి వివరాలను సేకరిస్తున్నారు.