ఎర్రగడ్డ : ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలే తిప్పి కొట్టి ఎన్నికల్లో తగిన బుద్ది చెబుతారని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. బోరబండ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా బోరబండ సైట్-1 కాలనీ తుర్రెభాజ్ఖాన్ కమ్యూనిటీహాల్లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియోద్దీన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి గోపీనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ పటిష్టానికి కార్యకర్తలు క్రమశిక్షణతో సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. గత పాలకుల హయాంలో దశాబ్దాలపాటు బోరబండ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న విధంగా ఉండేదన్నారు.
గత 6 ఏండ్ల వ్యవధిలో ఈ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారిన వైనం మన కండ్ల ముందే ఉన్నదని పేర్కొన్నారు. ఇంత తక్కువ వ్యవధిలో బోరబండ ఇంతగా అభివృద్ధి చెందటానికి బాబా ఫసియోద్దీన్ కృషి ఎంతగానో ఉందని అన్నారు. అనంతరం నూతనంగా నియమించబడ్డ కమిటీల ప్రతినిధులతో ప్రమాణం చేయించారు. కాగా బోరబండ డివిజన్ అధ్యక్షుడుగా కృష్ణమోహన్ను వరుసగా 3వ సారి ఎన్నుకున్నారు.