Hyderabad | తెలంగాణ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో భద్రతా వైఫల్యం బట్టబయలైంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి గుర్తుతెలియని వ్యక్తి టాస్క్ ఫోర్స్ పోలీసునంటూ మూడుసార్లు వచ్చి వెళ్లాడు. అంతేకాకుండా ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ను నమ్మించి అతని నుంచి రూ.2.82 లక్షలు కాజేశాడు.
ఇటీవల తెలంగాణ సెక్రటేరియట్లోకి నాలుగుసార్లు నకిలీ ఉద్యోగుల పేరిట గుర్తు తెలియని వ్యక్తులు రావడం ఘటనలు మరువక ముందే అత్యంత ప్రతిష్టాత్మకమైన, కట్టుదిట్టమైన భద్రత ఉండే కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ అంటూ మూడు సార్లు వచ్చి వెళ్లాడు. ఆ తర్వాత సీసీసీకి ఎదురుగా ఉన్న నిలోఫర్ కేఫ్లో కూకట్పల్లికి చెందిన జ్ఞానసాయి ప్రసాద్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్తో పరిచయం ఏర్పరచుకున్నాడు. తన పేరు హరిజన గోవర్దన్ అని.. టాస్క్ఫోర్స్ కానిస్టేబుల్ను అని చెప్పుకున్నాడు. గోవర్దన్ రెండు మూడు సార్లు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే బయటకు రావడంతో అతను నిజంగానే టాస్క్ఫోర్స్ అధికారి అని జ్ఞానసాయి ప్రసాద్ నమ్మాడు.
హోటల్ వ్యాపారంలో లాభాలు ఉంటాయని చెప్పి జ్ఞానసాయి ప్రసాద్ను గోవర్దన్ బురిడి కొట్టించాడు. అతని నుంచి రూ.2.82లక్షలు వసూలు చేశాడు. ఆ తర్వాత అతనికి కనిపించకుండాపోయాడు. దీంతో మోసపోయానని గ్రహించిన జ్ఞానసాయి ప్రసాద్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
కాగా, రేవంత్ రెడ్డితో పాటు అనేక మంది మంత్రులు కీలక సమావేశాలు ఏర్పాటు చేసుకునే ప్రాంగణంలోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించడం, భద్రతా వలయం నడుమ ఉండే ఐసీసీసీలోకి దుండగుడు వెళ్లడంపై భద్రతా వ్యవస్థకు అవమానం అని విమర్శలు వస్తున్నాయి.