కేపీహెచ్బీ కాలనీ, డిసెంబర్ 4 : కేపీహెచ్బీకాలనీ లోదా అపార్టుమెంట్స్ సమీపంలోని 4వ ఫేజ్లో ఉన్న చెరువు కబ్జా అవుతున్నదంటూ ఫ్యూచర్ ఫౌండేషన్ సొసైటీ పేరుతో మంత్రి కేటీఆర్కు, గవర్నర్కు, జిల్లా కలెక్టర్కు ఓ వ్యక్తి ట్విట్టర్లో ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్.. కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమతకు ట్వీట్ చేస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సంఘటనపై క్షేత్రస్థాయిలో పరిశీలించిన జీహెచ్ఎంసీ, హౌసింగ్ బోర్డు వెస్ట్రన్ డివిజన్ అధికారులు.. వాస్తవ విషయాలను ట్విట్టర్ ద్వారా మంత్రి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అది చెరువు కబ్జా కాదని, సెల్లార్ గుంతను పూడ్చివేసే పనులు చేస్తున్నారని వివరించారు.
మంత్రి కేటీఆర్కు ట్విట్టర్లో అందిన ఫిర్యాదు
అసలేం జరిగింది..
కేపీహెచ్బీ కాలనీ 4వ ఫేజ్ ఆర్టీఏ కార్యాలయం పక్కన హౌసింగ్ బోర్డు వెస్ట్రన్ డివిజన్ ఆధ్వర్యంలో భవన నిర్మాణాల కోసం సెల్లార్ గుంత తవ్వి వదిలేశారు. ఆ గుంతలో వర్షంనీరు భారీగా చేరడంతో ఆడుకోవడానికి వెళ్లిన ఐదుగురు చిన్నారులు ఆ గుంతలో పడి ప్రాణాలు వదిలారు. ఈ ఘటనపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించి.. సంబంధిత అధికారులను కలిశారు. సెల్లార్ గుంతను పూడ్చివేసి, చిన్నారుల ప్రాణాలు కాపాడాలని కోరారు. స్పందించిన అధికార యంత్రాంగం సెల్లార్ గుంతను మట్టితో పూడ్చి చదను చేస్తున్నారు. ఈ విషయం తెలియని ఓ వ్యక్తి ఫ్యూచర్ ఫౌండేషన్ పేరుతో మంత్రి కేటీఆర్కు ట్విట్టర్లో తప్పుడు ఫిర్యాదు చేసినట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది డిసెంబర్లో సెల్లార్ గుంతలో పడి ముగ్గురు చిన్నారులు మరణించగా.. నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురించిన.. ‘కంచెను దాటి కానరాని లోకాలకు’ ముగ్గురు చిన్నారుల ఉసురు తీసిన సెల్లార్ గుంత’.. అన్న వార్తను ట్విట్టర్లో పోస్ట్ చేసి వాస్తవ విషయాలను మంత్రి కేటీఆర్కు తెలియజేశారు.
నమస్తే తెలంగాణ కథనంతో వాస్తవ విషయాలను మంత్రి కేటీఆర్కు ట్విట్టర్లో వివరించిన అధికారులు