హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు (Cyber Fraud) రెచ్చిపోతున్నారు. సీనియర్ పోలీస్ ఆఫీసర్, ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ (CV Anand) పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతాలు సృష్టించారు. రెండు ఫేస్బుక్ అకౌంట్లు క్రియేట్ చేసిన దుండగులు.. డబ్బులు వసూలుచేయడమే కాకుండా అనుచిత సందేశాలు పంపుతున్నారు. గుర్తించిన హైదరబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నకిలీ ఖాతాలపై సుమోటోగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐపీ అడ్రస్ల ఆదారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.
ఇలాంటి నకిలీ ఖాతాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నకిలీవని తెలిసిన వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదుచేయాలని పేర్కొన్నారు. కాగా, గత కొన్నిరోజుల క్రితం గవర్నర్ తమిళిసై సోషల్ మీడియా ఖాతా హాక్ అయిన విషయం తెలిసిందే. అదేవిధంగా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియా అకౌంట్లను కూడా హ్యాకర్లు హ్యాక్చేశారు.