నకిలీ వర్క్ ఆర్డర్తో టోకరా
సిటీబ్యూరో, జూన్ 13 (నమస్తే తెలంగాణ) : బ్యాంకు రుణం పొంది, తీసుకున్న వ్యాపారానికి కాకుండా ఆ నిధులు ఇతర మార్గాలకు తరలించి లోన్ ఎగ్గొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, సికింద్రాబాద్ ఆర్పీ రోడ్డు శాఖ అధికారులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. ఫోలిస్ అలైడ్ కోర్ ప్రైవేట్ లిమిటెడ్(ఎఫ్ఏసీపీఎల్) సంస్థ, రుణం కోసం బ్యాంకుకు రెండు స్థిరాస్తులను మార్ట్గేజ్ చేయడంతో ఈ సంస్థకు మార్చి, 2020 నాటికి రూ. 1.74 కోట్ల క్యాష్క్రెడిట్ లిమిట్, రూ. 20 లక్షల టర్మ్లోన్ అవకాశం కల్పించింది. ఆ రుణంతో రెండు ఫార్మాసూటికల్స్కు సంబంధించిన మ్యాన్ఫ్యాక్చరింగ్ విభాగాలను బలోపేతం చేయాలనుకున్నారు. కానీ బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాన్ని సొంతానికి వాడుకోవడంతో జూన్, 2021 నాటికి ఈ ఖాతాలు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ జాబితాలోకి వెళ్లాయి.
బ్యాంకు అంతర్గత విచారణలో ఎంఎస్ఐఎల్ ల్యాబ్ గ్లాస్ వర్క్స్, ఇన్నోవేటివ్ కెమికల్ ఇంటర్చేంజ్ ప్రైవేట్ లిమిటెడ్లలో యంత్రాలు కొనుగోలుకు రుణం తీసుకుంటున్నట్లు చెప్పి, ఆ రుణాన్ని బాచు నీతిక, నికేశ్కుమార్ల ఖాతాలలోకి మళ్లించారు, వీళ్ల నుంచి నకిలీ వర్క్ అర్డర్ను తీసుకొని, బ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని ఫ్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో ఉన్న మార్ట్గేజ్ ప్రాపర్టీని రిలీజ్ చేసుకున్న వెల్లడయ్యింది. ఈ మేరకు బ్యాంకుకు రూ. 2.16 కోట్ల మోసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేపట్టారు.