శాలిబండ, నవంబర్ 21: ఒక్క ఫోన్కాల్ నగర పోలీసులను పరుగులు పెట్టించింది. చార్మినార్, ఆ చుట్టూ ఉన్న పరిసరాల్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు.. అది ఉత్తుత్తి కాల్గా తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కొద్ది సేపటిలో చార్మినార్ నేల మట్టం కానున్నదని వచ్చిన ఫోన్ సమాచారంతో పోలీసులు, బాంబ్స్కాడ్ సిబ్బంది ఆఘమేఘాలపై అక్కడికి చేరుకున్నారు.
చార్మినార్తోపాటు చుట్టూ ఉన్న ప్రాంతాల్లో తనిఖీలను చేపట్టారు. చుట్టూ ఉన్న చిరు వ్యాపారాలను అక్కడి నుంచి దూరంగా తరలించారు. చార్మినార్కు వచ్చే యాత్రికుల అనుమతులను రద్దు చేశారు. చార్మినార్, ఆ చుట్టూ ఉన్న పరిసరాలను తనిఖీ చేశారు. ఎక్కడ ఎలాంటి ప్రమాదకరమైన వస్తువు కనిపించలేదు. దీంతో పోలీసులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అది ఉత్తుత్తి ఫోన్ కాల్గా పోలీసులు నిర్ధారించారు.