సిటీబ్యూరో, జనవరి 28 (నమస్తే తెలంగాణ): కోల్కత్తా కేంద్రంగా నకిలీ బ్యాంకు గ్యారెంటీలను సృష్టిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు నగర సీసీఎస్ పోలీసులు. ముఠాలోని నలుగురు సభ్యులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 60 నకిలీ బ్యాంకు గ్యారెంటీ పత్రాలు, రెండు చెక్కులు, 5 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బషీర్బాగ్లోని పాత కమిషనరేట్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సైబర్క్రైమ్స్ డీసీపీ స్నేహా మెహ్ర కేసు పూర్వాపరాలను వెల్లడించారు. సాధారణంగా ఏదైనా కంపెనీ లేదా సంస్థ ప్రభుత్వం నుంచి ఏదేని కాంట్రాక్ట్ పనులు పొందిన సమయంలో కంపెనీ విశ్వసనీయత కోసం ప్రభుత్వానికి సదరు కంపెనీ బ్యాంకు గ్యారెంటీలను సమర్పించాల్సి ఉంటుంది. హర్షిత ఇన్ఫ్రా ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్లో బయోమైనింగ్ కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఇందులో భాగంగా రూ.కోటి విలువైన బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాలి. అంతే కాకుండా డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో మరో 11 బయో మైనింగ్ కాంట్రాక్ట్లను కూడా దక్కించుకుంది. దీంతో మొత్తం 2.25 కోట్ల బ్యాంక్ గ్యారెంటీలను హర్షిత ఇన్ఫ్రా ఇంజినీరింగ్ లిమిటెడ్ ప్రభుత్వ సంస్థలకు సమర్పించాల్సి ఉంది.
ఈ క్రమంలో హర్షిత ఇన్ఫ్రా కంపెనీ ప్రతినిధులు ప్రజ్వల్, సందీప్రెడ్డి తమకు పరిచయం ఉన్న కరీంనగర్కు చెందిన నాగరాజును బ్యాంకు గ్యారెంటీల కోసం సంప్రదించారు. దీంతో కమీషన్ మీద బ్యాంకు గ్యారెంటీలను ఇప్పిస్తానని నమ్మించిన నాగరాజు.. తనకు పరిచయస్తుడైన రాజస్థాన్లోని జైపూర్కు చెందిన నరేశ్ శర్మను బ్యాంక్ గ్యారెంటీల కోసం సంప్రదించాడు. నరేశ్ శర్మ కోల్కత్తా కేంద్రంగా నకిలీ బ్యాంక్ గ్యారెంటీలు సృష్టించే నీలోత్పల్ దాస్, సుబ్రజిత్ ఘోషల్ను సంప్రదించాడు. నీలోత్పల్ దాస్ తన స్నేహితుడైన నరేశ్ శర్మ ద్వారా నకిలీ బ్యాంక్ గ్యారెంటీలను సరఫరా చేస్తుంటాడు. ఈ క్రమంలో సుబ్రజిత్ ఘోషల్ ఇండస్ ఇండ్ బ్యాంక్ పేరు మీద 3.2 కోట్ల విలువైన నకిలీ బ్యాంకు గ్యారెంటీలను సృష్టించాడు. అందులో నుంచి 1.1కోట్ల విలువైన బ్యాంక్ గ్యారెంటీలను హర్షిత ఇన్ఫ్రా ఇంజినీరింగ్ కంపెనీ కోసం నాగరాజు తీసుకుని.. కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్, డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు సమర్పించాడు.
అంతే కాకుండా.. అధికారులు విచారణ జరిపినప్పుడు అనుమానం రాకుండా ఉండేందుకు నకిలీ వెబ్సైట్ను కూడా రూపొందించారు. ఈ క్రమంలో నాగరాజు సమర్పించిన బ్యాంక్ గ్యారెంటీ పత్రాలను సరిచూసేందుకు ప్రభుత్వ అధికారులు ఆన్లైన్ ద్వారా విచారణ జరపగా ఎలాంటి సమస్య తలెత్తలేదు. పత్రాలను కోల్కత్తాలోని ఇండస్ ఇండ్ బ్యాంక్కు పంపగా అవి నకిలీ బ్యాంక్ గ్యారెంటీ పత్రాలని అక్కడి బ్యాంక్ అధికారులు గుర్తించడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రంగంలోకి దిగిన నగర సీసీఎస్ పోలీసులు కోల్కత్తా కేంద్రంగా నకిలీ బ్యాంక్ గ్యారెంటీ పత్రాలు సృష్టిస్తున్న సుబ్రజిత్ ఘోషల్ (31), నీలోత్పల్ దాస్ (56)తో పాటు వాటిని చలామణి చేస్తున్న జైపూర్కు చెందిన నరేశ్ శర్మ, వరంగల్కు చెందిన గోడిషాల నాగరాజు(45)లను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. ఈ సమావేశంలో సైబర్ క్రైమ్స్ డీసీపీ స్నేహ మెహ్ర, సీసీఎస్, డీడీ అదనపు డీసీపీ ఎన్.మహేందర్, ఏసీపీ మోహన్కుమార్, ఇన్స్పెక్టర్లు ఎం.మట్టయ్య, కె.ప్రసాద్రావు తదితరులు పాల్గొన్నారు.