TSRTC | సిటీబ్యూరో, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ గ్రేటర్ జోన్ పరిధిలోని సిటీ బస్సుల్లో కొత్తగా ప్రవేశపెట్టిన ఎఫ్-24 (రూ.300 టిక్కెట్, టీ-6 (రూ.50 టిక్కెట్)కు ప్రయాణికుల నుంచి అపూర్వ స్పందన వస్తున్నది. అయితే కరోనా అనంతరం ఆదాయం పెంచుకోవడంపై దృష్టి పెట్టిన టీఎస్ ఆర్టీసీ… సిటీ బస్సు ప్రయాణికుల కోసం గతంలో టీ-24 టిక్కెట్ల విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విధానం వల్ల మంచి ఫలితాలు వచ్చాయి. ఈ పథకంలో రూ.100 టిక్కెట్ కొనుగోలు చేసి రోజంతా సిటీ బస్సుల్లో ప్రయాణించే సౌకర్యం కల్పించారు. కొనసాగింపుగా ఫ్యామిలీ కోసం కొత్తగా ఎఫ్- 24 టిక్కెట్ విధానాన్ని ఆర్టీసీ ప్రవేశ పెట్టింది. నలుగురు కలిసి ప్రయాణించడానికి రూ.400 బదులుగా రూ.300 నిర్ణయించారు. ఆర్డినరీ, మెట్రో సర్వీసుల్లో ప్రయాణించే విధంగా ఈ సర్వీసు అందుబాటులోకి తీసుకువచ్చారు. శని, ఆదివారంతో పాటు సెలవు రోజుల్లో మాత్రమే ఎఫ్-24 టిక్కెట్లు జారీ చేస్తారు. ఈ టిక్కెట్లు హైదరాబాద్ సబర్బన్ పరిధిలోనే చెల్లుతాయి.
మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం టీ-6 టిక్కెట్ పేరుతో మరో కొత్త సర్వీసు విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా రూ.50 చెల్లించి ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటలకు వరకు ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులతో పాటు హైదరాబాద్ సబర్బన్ పరిధిలో టీ-6 టిక్కెట్లు చెల్లుతాయని ఆర్టీసీ గ్రేటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈ.యాదగిరి తెలిపారు. ఈ టిక్కెట్లు కొనుగోలు చేసే క్రమంలో సీనియర్ సిటిజన్లు ఆధార్ కార్డు చూపించి కండక్టర్కు సహకరించాలని కోరారు.
ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి వరకు 33.38 కోట్ల ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. వారిలో 55.50 లక్షల మంది గతంలో ప్రవేశపెట్టిన టీ-24 టిక్కెట్లను కొనుగోలు చేశారు. ప్రస్తుతం ప్రతి రోజు సగటున 25 వేల వరకు ఆ టిక్కెట్లు అమ్మడవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నగర ప్రయాణికులకు, పర్యాటకులకు ఆర్టీసీ మరింత చేరువ కావడానికి టీ-6, ఎఫ్-24 టిక్కెట్ల విధానాన్ని యాజమాన్యం ప్రకటించింది. భవిష్యత్తులో సిటీ బస్సుల ఆదాయం పెంచుకునేందుకు మరికొన్ని రాయితీలు ప్రకటించే అంశాలు యాజమాన్యం పరిశీలనలో ఉన్నట్లు ఆర్టీసీ గ్రేటర్ జోన్ అధికారులు పేర్కొన్నారు.