సిటీబ్యూరో, జనవరి 24 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో కంటి వెలుగు కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతున్నది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాలకు ప్రజలు స్వచ్ఛందంగా వెళ్లి పరీక్షలు చేసుకుంటున్నారు. మంగళవారం గ్రేటర్ వ్యాప్తంగా మొత్తం 274 కేంద్రాల్లో 38,950 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో 9,556, మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేయగా, 5,991 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ కోసం సిఫారసు చేసినట్లు వైద్యాధికారులు వెల్లడించారు.
హైదరాబాద్లో..
నగరంలో 115 కేంద్రాల్లో 15,131 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి తెలిపారు. వారిలో 4,093 మందికి రీడింగ్ గ్లాసెస్ను పంపిణీచేశారు. 2,312 మంది రోగులకు ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ను సిఫారసు చేశారు.
రంగారెడ్డి జిల్లా పరిధిలో..
రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో 14,808 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 3,251 మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేశారు. 1,860 మందికి ప్రిస్కిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు.
మేడ్చల్జిల్లా పరిధిలో..
మేడ్చల్ జిల్లా పరిధిలోని 79 కేంద్రాల్లో 9,011 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 2212 మందికి రీడింగ్ గ్లాసెస్ అందించగా, 1819 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ కోసం సిఫారసు చేశారు.
సమాజమే ధ్యేయం మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్
అంధత్వ రహిత సమాజమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. మంగళవారం గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని విక్టోరియా ప్లే గ్రౌండ్, నాంపల్లి నియోజకవర్గం పరిధి విజయనగర్కాలనీ డివిజన్లోని ఫుట్బాల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని ఎమ్మెల్సీ ప్రభాకర్రావు, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్సింగ్ రాథోడ్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ 19వ తేదీన ప్రారంభమైన కంటివెలుగు కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల 22 వేల మందికి కంటి పరీక్షలు నిర్వహించి లక్షా 53వేల మందికి కంటి అద్దాలు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటి, డిప్యూటీ వైద్యాధికారి డాక్టర్ పద్మజ, తదితరులు పాల్గొన్నారు.