సిటీబ్యూరో, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాజేంద్రనగర్, మాదాపూర్, బాలానగర్, మూసాపేట, శేరిలింగంపల్లి, నానక్రామ్గూడ, ఖానామెట్, మాదాపూర్, అత్తాపూర్, సిక్ చావనీ.. తదితర ప్రాంతాల్లోని సమస్యాత్మక ప్రాంతాలలో సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సుడిగాలి పర్యటన చేశారు. ఆయా ప్రాంతాల స్థితిగతులను స్థానికులతో మాట్లాడి తెలుసుకున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న బందోబస్తు వివరాలపై ఆరా తీశారు. తొలుత రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని అత్తాపూర్, సిక్ చావనీలో పర్యటించారు. అనంతరం సిక్ చావనీలో సిక్కు కమ్యూనిటీ పెద్దలతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా పోలీసు శాఖ అన్ని రకాల చర్యలు చేపడుతున్నదని, పోలీసులకు ప్రజలు సహకరిస్తూ, శాంతియుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకు ప్రజలు కూడా తమ వంతుగా సహకరించాలన్నారు. పోలీసు సిబ్బంది కూడా పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. సీపీ పర్యటనలో బాలానగర్ డీసీపీ ఎ.శ్రీనివాసరావు, మాదాపూర్ డీసీపీ సందీప్, రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.