HMDA | సిటీబ్యూరో, నవంబర్ 4(నమస్తే తెలంగాణ): విశ్వనగర అభివృద్ధిలో కీలక పాత్రను పోషించే హెచ్ఎండీఏలో అరకొర సిబ్బందితో నెట్టుకొస్తోంది. ఏడు జిల్లాల పరిధిలో విస్తరించిన శాఖను బలోపేతం చేస్తామంటూ కాంగ్రెస్ చెప్పిన మాటలన్నీ నీట మూటలుగానే మారుతున్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే సిబ్బంది ఖాళీలపై హెచ్ఎండీఏను బలోపేతం చేసే దిశగా నివేదికలు తెప్పించుకున్న ప్రభుత్వం, ఆ తర్వాత ఆ విషయాన్నే పక్కన పెట్టింది.
హైదరాబాద్ పరిధిని విస్తరిస్తూ, అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామంటూ పదేపదే వ్యాఖ్యానించే సీఎం రేవంత్ రెడ్డి సొంత శాఖను నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో సంస్థ బలోపేతానికి అవసరమైన మానవ వనరుల కొరత ఇప్పుడు ఆ సంస్థను వేధిస్తున్నాయి. కొన్నేండ్లుగా ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో, డిప్యూటేషన్ ఉద్యోగులతో నెట్టుకొస్తుంది. హెచ్ఎండీఏలో శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తే గానీ బలోపేతం సాధ్యం కాదని పలువురు ఉద్యోగులు చెబుతున్నారు.
భారీ లే అవుట్లు, ఎకరాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రాజెక్టులు, సిటీ నలువైపులా కొత్త కొత్త టౌన్షిప్లకు అనుమతులు ఇవ్వడంలో కీలక పాత్ర పోషించే హెచ్ఎండీఏ.., సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతూంది. నగరానికి మణిహారంగా ఉన్న ఓఆర్ఆర్ నిర్వహణ, అవుటర్కు సమీపంలో లంగ్ స్పేస్ను పెంచడంలో కీలకమైన అర్బన్ ఫారెస్ట్ పార్కుల నిర్మాణంతో మౌలిక వసతుల ప్రాజెక్టుల నిర్మాణం వంటి వ్యవహారాలన్నీ హెచ్ఎండీఏ నిర్వహిస్తోంది.
ఇందులో ప్లానింగ్, ఇంజనీరింగ్తో అర్బన్ ఫారెస్ట్రీ వంటి ప్రధాన విభాగాలు ఉండగా.., హెచ్ఎండీఏ ఇప్పటివరకు ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు, నిర్మాణ అనుమతులను జారీ చేసింది. ఓ వైపు నిర్మాణ అనుమతులకు ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వచ్చినా.., నిర్మాణ అనుమతులను పర్యవేక్షించడానికి ప్లానింగ్ విభాగంలో సిబ్బంది కరువయ్యారు. ఇక కీలకమైన ప్రాజెక్టులను చేపట్టే ఇంజనీరింగ్ విభాగం కూడా చాలీచాలని సిబ్బందితో నెట్టుకొస్తుంది.
ఎక్కడా ఏ ప్రాజెక్టును చేపట్టాలి? ఎప్పుడూ వాటిని పూర్తి చేయాలనే విషయాలను పర్యవేక్షించేందుకు సిబ్బంది కరువైంది. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్ఎండీఏ పరిధిని ట్రిపుల్ ఆర్ వరకు విస్తరించాలనే ప్రతిపాదనలను తెర మీదకు తీసుకువస్తున్న తరుణంలో, సిబ్బంది కొరత ఇప్పుడు ఆ విభాగంలో చర్చనీయాంశంగా మారింది. 18 ఏళ్ల కిందట హెచ్ఎండీఏకు 600 పోస్టులు మంజూరైతే.., ఇప్పటివరకు ఉద్యోగుల సంఖ్య 15 శాతానికి దాటలేదు. ఇక ఉద్యోగులందరినీ డిప్యూటేషన్, అవుట్ సోర్సింగ్ విధానంలో నింపుకొంటూ పోతున్నారు.
తాము అధికారంలోకి వస్తే లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ.. చెప్పిన కాంగ్రెస్ అధినేత రేవంత్ రెడ్డి, అందుకు అనుగుణంగా నివేదికను తీసుకువచ్చారు. పెండింగ్లో ఉన్న ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామని ఉద్యోగ సంఘాల నేతలకు స్పష్టం చేశారు. కానీ, ఇప్పటికీ ఆ దిశగా ఒక్క అడుగు ముందుకు పడలేదు. ప్రధానంగా ప్రభుత్వానికి రెవెన్యూ తీసుకు వచ్చే కీలకమైన ప్లానింగ్ విభాగాన్ని పట్టించుకోవడం లేదు. అరకొర సిబ్బందితో నెట్టుకొస్తుండగా, పూర్తి స్థాయి సిబ్బందిని నియమించాలని ఉద్యోగ సంఘాలే ప్రభుత్వానికి లేఖ కూడా రాశాయి.
జూనియర్ ప్లానింగ్ ఆఫీసర్ల కొరత తీవ్రంగా ఉందని, 44 మంది ఉండాల్సిన విభాగంలో కేవలం ఒక్కరే ఉన్నారని, మిగిలిన వారంతా అవుట్ సోర్సింగ్, డిప్యూటేషన్పై వచ్చినవారే. ఏఈఈ, జూనియర్ అసిస్టెంట్లు, అర్కిటెక్చరల్ డ్రాఫ్ట్మెన్, టైపిస్టులు ఇలా 200కు పైగా ఉద్యోగుల భర్తీ తక్షణమే చేయాలని కోరగా, అదే సమయంలో ఉద్యోగాల భర్తీ చేయకపోవడంతో అన్ని రిటైర్డ్ అయ్యేవారితో విభాగాలన్నీ ఖాళీ అవుతున్నాయని హెచ్ఎండీఏ వర్గాలు పేర్కొన్నాయి. అందుకు అనుగుణంగా రూపొందించిన నివేదికను పక్కనపెట్టింది. గడిచిన తొమ్మిది నెలలుగా ఈ అంశంపై ఒక్కసారి కూడా సమీక్షించలేదని హెచ్ఎండీఏ ఉద్యోగ సంఘాల నేతలు వాపోతున్నారు.
చాలా కాలంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ లేకపోవడంతో తమకు రావాల్సిన ప్రమోషన్లలో అన్యాయం జరుగుతుందని, ఉన్నత స్థాయి క్యాడర్లలో ఉండే ఉద్యోగాలకు డీటీసీపీ, ఇతర ఇతర ఇంజనీరింగ్ శాఖల నుంచి ఉద్యోగులు రావడంతో, మాతృ సంస్థలో నియమితులైన ఉద్యోగులు పదోన్నతి అవకాశాలను కోల్పోతున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో హెచ్ఎండీఏ పరిధిని పెంచాలని భావిస్తున్న ప్రభుత్వం తొలుత పూర్తి స్థాయి సిబ్బంది నియామాకంపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. సరిపోయేంత సిబ్బంది ఉన్నప్పుడే హెచ్ఎండీఏ పాలనా వ్యవహారాలు మెరుగుపడతాయని, లేదంటే ఆదాయ వనరులను కోల్పోయే అవకాశం ఉంటుందని హెచ్ఎండీఏ వర్గాలు పేర్కొన్నాయి.
నిజానికి డిపార్ట్మెంట్ పాలన వ్యవహారాలను చక్కబెట్టడంలో సమృద్ధిగా ఉండే సిబ్బందితోనే సాధ్యం. అయితే, ఇన్నాళ్లుగా డిప్యూటేషన్ విధానంలో నెట్టుకొచ్చినా, పరిధి పెంచిన తర్వాత కూడా అదే సిబ్బందితో కార్యాకలాపాలు నిర్వహిస్తామంటే తమపై తీవ్రమైన పని ఒత్తిడి పెరుగుతుందని కొందరు ఉద్యోగులు వాపోతున్నారు. ప్రధానంగా ప్రభుత్వ ఖజానా నింపడంలో కీలకమైన ప్లానింగ్ విభాగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు మాతృ సంస్థ ఉద్యోగులను కాదని, డిప్యూటేషన్పై వచ్చిన అధికారులే వ్యవహారాలు చక్కబెట్టుకొస్తున్నారు.
ఈ క్రమంలో బిల్డింగ్, లే అవుట్ అనుమతుల విషయంలో కీలకమైన ఈ విభాగాన్ని పూర్తి స్థాయిలో మాతృ సంస్థ ఉద్యోగులను తీసుకు రావడం వలన… పాలన వ్యవహారాల్లోనూ పారదర్శకత పెరుగుతుంది. కానీ, ప్రభు త్వం అవేవీ పట్టనట్లుగా కేవలం పరిధి పెంచి ఉన్న సిబ్బందితోనే నెట్టుకొస్తూ రెవెన్యూ పెంచుకునేందుకు దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. సిబ్బంది కొరత కారణంగా పని ఒత్తిడి పెరుగుతుందే తప్ప, సమర్థవంతంగా పనిచేసే సిబ్బంది లేరని హెచ్ఎండీఏ వర్గాలు చెబుతున్నాయి.