మాదాపూర్, జూలై 16 : అక్రమంగా మద్యం విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన ఆదివారం శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గాంధీనాయక్ తెలిపిన వివరాల ప్రకారం… చందానగర్లోని పీజేఆర్ ఎన్క్లేవ్లో అక్రమంగా తీసుకువచ్చిన మద్యం బాటిళ్లను విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు దాడులు జరిపారు.
చందానగర్కు చెందిన రామ కోటేశ్వరరావు (45), గుంటూరుకు చెందిన మనోజ్ తేజ (28), మదీనాగూడకు చెందిన ప్రభాకర్రెడ్డి (39), మియాపూర్కు చెందిన మహిపాల్ గౌడ్ (35)ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద గోవా నుంచి తీసుకువచ్చిన రూ.4 లక్షల విలువైన 1568 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో ఎస్టీఎఫ్ ఇన్స్పెక్టర్ లతీఫ్, జి.వెంకట్రాంరెడ్డి, శేరిలింగంపల్లి ఎక్సైజ్ శాఖ ఇన్స్పెక్టర్ గాంధీ నాయక్, ఎస్సైలు మురళి, వీరబాబు, శ్రీనివాసు, సిబ్బంది ఉన్నారు.