చార్మినార్/మెహిదీపట్నం/కార్వాన్, జూలై 16 : గజ్జెకట్టి, ఒంటినిండా పసుపు పూసుకున్న పోతరాజు ముందు నడవంగా భక్తులు అమ్మవారికి నైవేద్యం అందించేందుకు నెత్తిన బోనాలెత్తి అమ్మవారి గుళ్లకు భక్తి పారవశ్యంగా కదిలారు. ఆషాఢమాసం బోనాల నేపథ్యంలో పాతనగరం ఆదివారం బోనమెత్తింది. పాతబస్తీలోని చారిత్రాత్మక దేవాలయాలైన లాల్దర్వాజా సింహవాహినీ అమ్మవారి దేవాలయంతోపాటు అక్కన్నమాదన్న, చార్మినార్ భాగలక్ష్మి, దూద్బౌలి పైనీరు అమ్మవారి, దేవాలయంతోపాటు మీర్అలంమండి శ్రీ మహాకాళేశ్వర అమ్మవారి దేవాలయం, ఉప్పుగూడ మహాకాళి ఆలయం, సుల్తాన్షాహీ జగదాంబ అమ్మవారి దేవాలయాల్లో భక్తులు అమ్మవారిని కొలుస్తూ బోనాల నైవేద్యాన్ని సమర్పించారు. అడుగడుగునా అమ్మవారికి వేపాకులతో కూడిన నీళ్లు, కల్లు, ఇతర ద్రవ్యాలను సాకరూపంలో సమర్పిస్తూ అమ్మవారి అరిష్టాలు, విషజ్వరాలు, ఇతర అనారోగ్య సమస్యల నుంచి దూరం చేస్తూ మీ బిడ్డలను క్షేమంగా చూడుతల్లీ అంటూ మొక్కి చేతులెత్తి అమ్మ వారికి దండం పెట్టారు. అదే సమయంలో సకాలంలో వర్షాలు కురుస్తూ సమస్త జీవజాతిని కాపాడేందుకు చొరవ తీసుకోవాలంటూ భక్తులు వేడుకున్నారు.
గోల్కొండ కోటలో ఎనిమిదో బోనం పూజలు
గోల్కొండ కోట జగదాంబిక ఎల్లమ్మ ఆషాఢ మాసం బోనాలలో భాగంగా ఎనిమిదో బోనం పూజలను ఆదివారం వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఘనంగా జరుపుకున్నారు. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల షిగాలు,యువకుల కేరింతలతో మహిళలు బోనాలను ఎత్తుకుని వెళ్లి, తొట్టెలతో జగదాంబిక ఎల్లమ్మకు సమర్పించారు. ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ ఆరెళ్ల జగదీశ్ యాదవ్,ఈవో శ్రీనివాస్రాజు, పూజారి సర్వేశ్వర్ చారి, సభ్యులు భక్తులకు సేవలు అందజేశారు.అదేవిధంగా మహంకాళి అమ్మవారిని కూడా భక్తులు దర్శించుకున్నారు. కులవృత్తుల సంఘం అధ్యక్షుడు బి.సాయిబాబా చారి, ఆలయ పూజారి సురేశ్చారిలు భక్తులకు ఇబ్బందులు లేకుండా పూజలు చేశారు. దక్షిణ,పశ్చిమ మండలం డీసీపీ కిరణ్ ఖరె ప్రభాకర్ పర్యవేక్షణలో ఏసీపీ సతీశ్, కోటేశ్వర్రావులు బందోబస్తు, ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు.
కార్వాన్లో సబ్బీమండిలో..
కార్వాన్ సబ్జీమండీలోని మహంకాళి, నల్లపోచమ్మ అమ్మవార్ల ఆలయాల్లో ఘనంగా బోనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహంకాళి ఆలయం నుంచి నల్లపోచమ్మ ఆలయం వరకు అమ్మవారి ప్రతిమను ఏనుగు అంబారీపై ఘనంగా నిర్వహించారు. వివిధ వేషధారణల్లో కళాకారులు అలరించగా పోతరాజులు సందడి చేశారు. ఈ పూజా కార్యక్రమాలలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్,ఇంద్రకరణ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.