నాంపల్లి క్రిమినల్ కోర్టు, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా సిటీ సివిల్ కోర్టు, సిటీ స్మాల్ కాజ్ కోర్టుల్లో మొత్తం 415 సివిల్ కేసులు రాజీమార్గంలో పరిష్కారమైనట్లు సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ రేణుకయారా వెల్లడించారు. అంతకుముందు సిటీ సివిల్ కోర్టులో జరిగిన లోక్అదాలత్ ప్రారంభ సభలో సిటీ సివిల్ కోర్టు 26వ అదనపు చీఫ్ జడ్జి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు.
19 బేంచీలు .. 37453 కేసులు
లోక్అదాలత్లో మొత్తం 19 బెంచీలు ఏర్పాటు చేసి.. 37453 కేసులను పరిష్కరించినట్లు మెట్రోపాలిటన్ న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధికా జైస్వాల్ తెలిపారు. కుటుంబ తగాద కేసులు 93, చెక్ బౌన్స్ కేసులు 1038 కాగా, ఎస్టీసీ 34116, ప్రిలిటీగేషన్ కేసులు 996, ఆబ్కారీ కేసులు 78, సీసీ ఐసీసీ – 1086, ఇతర క్రిమినల్ కేసులు 46 పరిష్కరించినట్లు వివరించారు.
రంగారెడ్డి జిల్లా కోర్టులు, ఆగస్టు 13 : రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రాంగణంలో లోక్ అదాలత్ నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా రెండో అదనపు ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాసచారి, రంగారెడ్డి జిల్లా అడ్వకేట్స్ బార్ ప్రెసిడెంట్ సుధాకర్రెడ్డి, రాచకొండ సీపీ మహేశ్ భగవత్, అడ్మిన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కస్తూరి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి మాట్లాడుతూ 85,829 క్రిమినల్, 76 సివిల్ , మోటార్ వాహన ప్రమాద బీమా కేసులు, 415 బ్యాంకు రికవరీ, ప్రీలిటిగేషన్ కేసులు పరిష్కరించినట్లు వెల్లడించారు.
సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రాచకొండ కమిషనరేట్ ఆవరణలో నిర్వహించిన లోక్ అదాలత్లో 32,250 కేసులు పరిష్కారమయ్యాయి. కార్యక్రమంలో రంగారెడ్డి ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జి ఆర్. తిరుపతి తదితరులు పాల్గొన్నారు.