హిమాయత్నగర్, సెప్టెంబర్ 11: రాష్ట్రంలోని ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని, అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఆదివారం హైదర్గూడలోని ఈఎఫ్ గార్డెన్లో హిమాయత్నగర్ డివిజన్కు చెందిన 900 మంది లబ్ధిదారులకు మంజూరైన ఆసరా పెన్షన్ల గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో రూ.200 పెన్షన్ ఇచ్చే వారని, అవి సకాలంలో రాకపోవడంతో లబ్ధిదారులు అనేక ఇబ్బందులు పడేవారని తెలిపారు.
రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమంతో పాటు అభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్య క్రమాలను అమలు చేస్తున్నదన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా పేదింటి నిరుపేద ఆడబిడ్డల పెండ్లీల కోసం కల్యాణ లక్ష్మి పథకం, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశ పెట్టి లబ్ధిదారులకు రూ.1లక్ష 116 ఆర్థిక సహాయం అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతున్నదన్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటిరి మహిళలు, డయాబెటిక్ పేషెంట్లు, దివ్యాంగులకు ఆసరా పెన్షన్లు కొండంత అండగా నిలుస్తున్నాయని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా బీజేపీ పాలిత రాష్ర్టాల్లో పెన్షన్లు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న దాఖలాలు లేవన్నారు. ప్రజల సంక్షేమం కోసం కేంద్రమంత్రి కిషన్రెడ్డి కేంద్రం నుంచి కనీసం ఒక రూపాయి కూడా తీసుకురాలేదని విమర్శించారు.
అర్హులందరికీ ఆసరా అందిస్తాం..
రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించి ఆత్మగౌరవంతో ప్రజలు జీవించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. 57 ఏండ్లు నిండి అర్హులైన వారందరికీ ఆసరా పెన్షన్లు అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నదని పేర్కొన్నారు. పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ ప్రసన్న రామ్మూర్తి, హిమాయత్నగర్ కార్పొరేటర్ జి.మహాలక్ష్మి, కార్పొరేటర్లు మన్నె కవితారెడ్డి, వెల్దండ వెంకటేశ్, వనం సంగీతా యాదవ్, హైదరాబాద్ ఆర్డీవో కార్యాలయ అధికారి జోహరోద్దీన్, నాంపల్లి మండలం తహసీల్దార్ ప్రసాద్, హిమాయత్నగర్ మండలం తహసీల్దార్ సుజాత తదితరులు పాల్గొన్నారు.