మేడ్చల్, అక్టోబర్ 25 : ఉమ్మడి రాష్ట్రంలో రైతన్నకు అన్నీ తిప్పలే ఉండేవి. ప్రతి వ్యవసాయ సీజన్ను కష్టాలతో ఆరంభించాల్సి వచ్చేది. ప్రతిసారీ ఎదురీతే. వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చేది. విత్తనాలు సకాలంలో దొరికేవి కావు. అది దాటుకుని ముందుకెళ్తే పంట చేనులో వేయడానికి యూరియా తదితర ఎరువుల కోసం ఆపసోపాలు పడాల్సి వచ్చేది. వరుసగా రెండు రోజులపాటు లైన్లో నిలిచి ఉంటే గానీ బస్తా యూరియా దొరకని దుస్థితి ఉండేది. పంట ఎదుగుతున్న సమయంలో కరెంట్ కోతలు, ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు కాలిపోవడం వంటి బాధలు ఉండేవి. అవి దాటుకొని ముందుకెళ్తే గిట్టుబాటు ధర దక్కేది కాదు. చేసిన అప్పులు తీర్చలేక ఉరికొయ్యలకు వేలాడాల్సిన దయనీయ బతుకులు రైతులవి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పరిపాలన బాధ్యతలు స్వీకరించిన సీఎం కేసీఆర్ రైతు సంక్షేమంపై ప్రధానంగా దృష్టి సారించారు. కరెంట్ కోతలను నివారిస్తూ 24 గంటల విద్యుత్ కలను సాకారం చేశారు. సకాలంలో ఎరువులు, విత్తనాలను సమకూర్చారు. పెట్టుబడి సాయం కోసం రైతులు ఎవరికీ చేయి చాచకుండా చారిత్రాత్మక పథకం ‘రైతుబంధు’కు శ్రీకారం చుట్టారు. రైతు సంక్షేమం కోసం తీసుకున్న సంక్షేమ కార్యక్రమాల్లో ‘రైతుబంధు’ ఒక మైలురాయిగా నిలిచింది.
రూ.293 కోట్ల సాయం
మేడ్చల్ నియోజకవర్గం పట్టణాలు, పల్లెలతో కలగలిసి ఉన్నది. మేడ్చల్, శామీర్పేట, మూడుచింతపల్లి, ఘట్కేసర్, కీసర, మేడిపల్లి, కాప్రా మండలాల్లో 61 పంచాయతీలు, 7 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు ఉన్నాయి. 2018 వానాకాలం నుంచి రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందివ్వడం ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 11 విడుతలుగా రైతులకు పెట్టుబడి సాయం అందింది. మొదటి నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే నియోజకవర్గంలోని దాదాపు 32వేల మంది రైతులకు రూ.293.29 సాయం అందింది. 2018 యాసంగి నుంచి ఇప్పటి 2023 వానాకాలం వరకు రైతులకు అందిన సాయం ఇలా ఉన్నది.
గణనీయంగా పెరిగిన సాగు విస్తీర్ణం
తెలంగాణ రాక ముందు మేడ్చల్ నియోజకవర్గంలో కేవలం 22వేల ఎకరాల్లో మాత్రమే పంట సాగయ్యేది. తొమ్మిదేళ్లలో పెట్టుబడి సాయం అందివ్వడంతోపాటు రైతు సంక్షేమానికి తీసుకున్న చర్యలతో సాగు విస్తీర్ణం 62వేల ఎకరాలకు పెరిగింది. నగర శివారులో ఉన్న మేడ్చల్ నియోజకవర్గం లాంటి ప్రాంతంలో సాగు విస్తీర్ణం భారీగా పెరగడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలే కారణమని రైతులు, వ్యవసాయ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రైతుబంధు ఎరువులు, విత్తనాలు కొనుగోలు, దున్నకాలకు ఉపయోగపడుతున్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ తమకు దేవుడితో సమానమని, అడగకుండానే అన్ని చేస్తున్నాడని, ఆయన వల్లే ఈ గౌరవం దక్కిందని అంటున్నారు.
మందు సంచులు తెచ్చుకుంటాం
మాకు అద్దెకరం పొలం ఉన్నది. ప్రతిసారి రైతుబంధు వస్తున్నది. పైసలు వచ్చిన వెంటనే మందు సంచులు తెచ్చుకుంటాం. సీఎం కేసీఆర్ సల్లంగా ఉండాలి. రైతులను ఆదుకుంటుండు. అంతకు ముందు రైతులకు సావుకార్లే దిక్కయితుండే. వాళ్ల దగ్గర అప్పులు తెచ్చుకొని, వాళ్లకే ఎంతకు చెబితే అంతకు అమ్ముకునేటోళ్లం. కేసీఆర్ వచ్చినంక ఆ బాధలు పోయినయి. దేనికి రందీ లేకుండా పోయింది. అప్పుడైతే బతకడమే కష్టంగా ఉండేది. పని లేకుండా ఉండేది. అడ్డమీదికి పోయి కూలీనాలీ చేసుకుని, బతుకుతుంటిమి. ఇప్పుడే మాకున్న ఉన్న కొద్ది పొలం పంట పండించుకుంటున్నాం. పంటలు బాగా పండుతుండటంతో ఈ చుట్టు పక్కల చేన్లలో పని దొరుకుతున్నది. రైతులకు మంచి రోజులు వచ్చినయి. అంతా ఆ సారు దయే. ఇలాంటి ముఖ్యమంత్రి మేం ఎప్పుడు చూడలేదు. మళ్లీ ఆయన వస్తేనే రైతులు, ప్రజలకు మంచి జరుగుతుంది.
– ముక్కెర సక్కు, రైతు, జగన్గూడ, శామీర్పేట మండలం
రైతన్నకు రంది లేదు
రైతన్నకు సీఎం కేసీఆర్ రందీ లేకుండా చేసిండు. మాకు రెండెకరాల పొలం ఉన్నది. పంట పంటకు పైసలు వస్తున్నాయి. దున్నకాలకు, కలుపు తీయడానికి, ట్రాక్టర్ కిరాయికి, మందు సంచులకు వాడుకుంటున్నాం. కేసీఆర్ వచ్చినప్పటి నుంచి అయితే రైతులకు మంచిగుంది. అంతకు ముందు మేం లాగోడుకు మేకలు, గొర్రెలను అమ్ముకునేవాళ్లం, సొసైటీలో, సావుకార్ల దగ్గర అప్పు తెచ్చుకునేటోళ్లం. తిరిగి మిత్తితోని కట్టాల్సి వచ్చేది. ఇప్పుడేమీ బాధలేదు. కరెంట్ కూడా బాగా ఇస్తుండు. గతంలో ఎకరా సాగు చేసేవాళ్లం. ఇప్పుడు నీళ్లున్నయి, కరెంట్ ఉన్నది. రెండెకరాల సాగు చేస్తున్నాం. ఎవరో ఏదో చెబుతారు.. అదంతా ఉత్తదే. రైతుబంధు ఇస్తుండు, పింఛన్ ఇస్తుండు ఏదో రకంగా సాయం చేస్తనే ఉన్నాడు. నాకు రైతుబంధు వస్తుంది, పింఛన్ వస్తుంది. అప్పుడైతే గిట్ల లేకుండే. మళ్లీ ఆయన(కేసీఆర్) వస్తేనే బాగుంటది. కాంగ్రెస్ వస్తే అయితే కరెంట్ సున్నా. మీటర్లు పెడతరంటా. ఎవరెన్ని చెప్పినా నమ్మలేం. మనకు కండ్ల ముంగట కన్పిస్తున్నది ఇడిచిపెట్టి, ఏం చేస్తామంటే ఎట్ల నమ్ముతాం.
– మోతే లక్ష్మయ్య, గోసాయిగూడ, మేడ్చల్ మండలం