సిటీబ్యూరో/కొండాపూర్, మార్చి 7(నమస్తే తెలంగాణ) : ఆర్థిక స్వాతంత్య్రం వచ్చినప్పుడే మహిళలకు గౌరవం దక్కుతుందని, ఆ దిశగా ప్రతి ఒక్క ఆడబిడ్డ ప్రయత్నం చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. చందానగర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మాజీ కార్పొరేటర్ నవతారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని పలు రంగాల్లో సేవలు అందించిన వారిని సత్కరించి పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలన్నారు. ఆడబిడ్డలు తమ కాళ్ల మీద నిలబడాలన్నారు. ఆర్థిక స్వాతంత్య్రం సాధించేందుకు ముందుకు సాగాలన్నారు. ఉద్యోగం, వ్యాపార రంగాల్లో రాణిస్తూ కుటుంబాలకు ఆసరాగా నిలవాలన్నారు. ఆ స్థాయికి ఎదిగినప్పుడే సమాజంలో మహిళలకు గౌరవం, గుర్తింపు ఉంటుందన్నారు.
పార్టీ కార్యాలయం ప్రారంభం
చందానగర్లోని విద్యానగర్ కాలనీలో సీనియర్ నాయకులు నవతారెడ్డి ఏర్పాటు చేసిన శేరిలింగంపల్లి బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు. అనంతరంలో పార్టీలో చేరిన వివిధ నాయకులకు కండువా కప్పి గులాబీ పార్టీలోకి ఆహ్వానించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా పనిచేయాలని ఈ సందర్భంగా నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఆడబిడ్డల ఆశీస్సులతో తెలంగాణలో మరోసారి కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, మరిన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలను తీసుకువస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కృష్ణారావు, అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మమత తదితరులు పాల్గొన్నారు.