సిటీబ్యూరో, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): కర్బన ఉద్గారాలను తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి విక్రయాలను ప్రోత్సహిస్తున్నది. అయితే ఈవీ వాహనాల్లో బ్యాటరీల నాణ్యత దెబ్బతిని కొన్ని వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏఐఎస్ 156 నిబంధనలకు అనుగుణంగా ఈవీ వాహనాల తయారీ ఉండాలని నిర్దేశించడంతో ఇప్పుడు అన్ని కంపెనీలు ఆ దిశగా రూపొందిస్తున్నాయి. అయితే విద్యుత్తు వాహనాల విషయంలో వినియోగదారులకు ఇంకా కొన్ని అపోహలు ఉన్నాయి. కరెంట్ వినియోగంతో కూడుకుని ఉండటంతో షార్ట్ సర్యూట్ లాంటి ప్రమాదాలకు భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్తు వాహనాల సాంకేతిక కంపెనీలలో విధులు నిర్వర్తిస్తున్న కొంతమంది ప్రముఖులు ఈవీ ప్రమాదాలు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
బ్యాటరీపై ఒత్తిడి పడకుండా చూసుకోవాలి
ఎలక్ట్రిక్ కార్లు, త్రీ, ద్విచక్ర వాహనాలు లిథియం అయాన్ బ్యాటరీలతో పనిచేస్తాయి. అయితే కొంతమంది కస్టమర్లు నాణ్యతలేని బ్యాటరీలను వినియోగిస్తారు. అది చాలా ప్రమాదకరం. కంపెనీ బ్రాండ్లనే వినియోగించాలి. కొన్నిసార్లు బ్యాటరీ తయారీలో లోపం ఉంటే మంటలు వచ్చే ప్రమాదం ఉంటుంది. బ్యాటరీ మరీ ఎకువ ప్రకంపనలకు లోనవుతుంది. చార్జింగ్ సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే షార్ట్ సర్క్యూట్ ఏర్పడుతుంది. ఈవీల నుంచి ఎకువ మైలేజీ, ఎకువ ప్రయాణ దూరాలను ఆశిస్తున్నారు. ఫలితంగా బ్యాటరీపై ఒత్తిడి పెరిగి వేడెక్కుతాయి. సరిగ్గా ఆసమయంలో బ్యాటరీలోకి గాలి ప్రవేశిస్తే మంటలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో పేలిపోవచ్చు. వినియోగదారులకు ఈవీలపై అవగాహన ఉండాలి.
-ఫ్రిడిబి, టెక్నికల్ ఎక్స్పర్ట్, ఈవీ.
సాలిడ్ స్టేట్ బ్యాటరీలను తయారు చేయాలి
మంటలు వ్యాపించే ముందు పొగ వస్తుంది. దానిని గుర్తించి వెంటనే బ్యాటరీని తొలగించి మట్టి లేదా.. చల్లని ప్రాంతంలో పెడితే ప్రమాదం జరుగకుండా ఉంటుంది. బ్యాటరీ లోపల ఉంటే ఆర్గానిక్ ద్రవరూప ఎలక్ట్రోలైట్లు మంటలకు ఇంధనంగా ఉపకరిస్తాయి. లిథియం బ్యాటరీ తయారీలో, డిజైన్లో, దాన్ని నడిపే సాఫ్ట్వేర్లో సమస్యలు ఉన్నా మంటలు ఏర్పడుతాయి. ప్రస్తుతం లిథియం బ్యాటరీలు ఎకువగా చైనా నుంచి దిగుమతి అవుతున్నాయి. లిథియం బ్యాటరీల్లో ద్రవరూప రసాయనాలకు బదులు ఘన పదార్థాలను వాడటం ద్వారా అగ్రి ప్రమాదాలను నివారించే అవకాశం ఉంది. సాలిడ్ స్టేట్ బ్యాటరీలను తయారు చేయాలని చాలా కంపెనీలు భావిస్తున్నాయి.
-శ్రావణ్ కుమార్, టెక్నికల్ ఆఫీసర్, సౌతర్న్ ఏషియా, హాప్.
బ్యాటరీలోకి నీరు వెళ్లకుండా జాగ్రత్తపడాలి
బ్యాటరీ ఒక్కసారిగా వేడెకడం లేదా ఉబ్బిపోవడం జరుగుతుంది. బండి ఆపిన తర్వాత కొంత సేపటిదాకా లిథియం బ్యాటరీ వేడిగానే ఉంటుంది. అందువల్ల ఈవీని స్విచ్ఛాప్ చేసిన తర్వాత వెంటనే చార్జింగ్ పెట్టకూడదు. బ్యాటరీ చల్లబడే వరకు ఆగాలి. డిటాచబుల్ బ్యాటరీ అయితే బండి నుంచి వేరుచేసి చార్జింగ్ పెట్టాలి. ఏ వాహనానికి ఉద్దేశించిన బ్యాటరీని ఆ వాహనానికే ఉపయోగించాలి. నాణ్యతలేని బ్యాటరీలను వాడితే వాహనం పేలిపోయే ప్రమాదం ఉంది. ఈవీతో పాటు వచ్చిన కేబుల్తోనే చార్జింగ్ చేయాలి. డిటాచబుల్ బ్యాటరీలను నీడలో, గాలి తగిలేలా భద్రపర్చాలి. బ్యాటరీ పూర్తిగా చార్జి అయ్యాక వెంటనే చార్జింగ్ సాకెట్ నుంచి తీసేయాలి.
-సిద్దేశ్ గొసావి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఈవీ.