సుల్తాన్బజార్,ఏప్రిల్ 26 : ప్రభుత్వ దవాఖానల్లో చికిత్సలు పొందుతున్న రోగులు, రోగి సహాయకుల సౌకర్యార్థం స్వచ్ఛంద సంస్థలు తమవంతు సహకారం అందిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి రోగుల వెంట ఉండడానికి వచ్చే వారికి తాగునీటిని అందించాలనే ఉద్దేశ్యంతో ఉస్మానియా దవాఖానలో భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి, సఫా బైతుల్ మాల్ స్వచ్ఛంద సంస్థలు, సుల్తాన్బజార్ ప్రభుత్వ ప్రసూతి దవాఖానలో ఇక్రా డాక్టర్స్ హైదరాబాద్ సంస్థలు 1000 లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి ఫిల్టర్ వాటర్ను అందిస్తున్నారు. వారి సేవలకు రోగి సహాయకులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. సుల్తాన్బజార్ ప్రభుత్వ ప్రసూతి దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ కె.రాజ్యలక్ష్మి వారి సేవలకు అభినందనలు తెలిపారు.
రోగులు, రోగి సహాయకుల సౌకర్యార్థం ఐ కేర్ హెల్త్, ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్టు, ఇక్రా డాక్టర్స్ హైదరాబాద్ సంస్థల ఆధ్వర్యంలో రూ. 10 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను ప్రారంభించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
ప్రభుత్వ దవాఖానలకు వివిధ జిల్లాల నుంచి వచ్చే పేద రోగులు, రోగి సహాయకులకు వాటర్ప్లాంట్ ఏర్పాటుతో తాగునీటి సమస్య తీరింది. స్వచ్ఛంద సంస్థలు వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసి మానవ సేవయే మాధవ సేవ అని నిరూపించుకున్నారు. డబ్బులు పెట్టి కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా ఈ ఫిల్టర్ నీటిని సద్వినియోగం కావడంపై రోగి సహాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఉస్మానియా దవాఖానకు నిత్యం రెండు వేలకు పైగా రోగులు వైద్య చికిత్సల నిమిత్తం వస్తుంటారు. ఈ వేసవిలో వాటర్ ప్లాంట్ ద్వారా చల్లటి ఫిల్టర్ వాటర్ను అందిస్తుండటం హర్షణీయం.