మేడ్చల్, సెప్టెంబర్ 23(నమస్తే తెలంగాణ): ఆధునిక పోకడలతో నిత్యం ప్రకృతిలో చోటు చేసుకుంటున్న మార్పులను తట్టుకునే విధంగా, వాతావరణంలోనూ సంభవిస్తున్న పెను మార్పులను ఎదుర్కొనేలా ప్రభుత్వ అధికార యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపడుతున్నది. వాతావరణ సమతౌల్యాన్ని కాపాడేందుకు, పర్యావరణ పరిరక్షణకు, పచ్చదనం పెంపుదలకు, భూ పరిరక్షణకు అటవీ శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధికార యంత్రాంగం మరిన్ని పార్కులను ఏర్పాటు చేసేలా అడుగులు వేస్తున్నది. ఇప్పటికే జిల్లాలో పదుల సంఖ్యలో పార్కులు ఉన్నప్పటికీ, వాతావరణంలో నెలకొంటున్న ప్రకృతికి విరుద్ధమైన మార్పులను అరికట్టేందుకు మరో రెండు అర్బన్ పార్కులను అటవీ శాఖ ఏర్పాటు చేస్తున్నది.”
పర్యావరణ పరిరక్షణకు, పచ్చదనం పెంపునకు అటవీ శాఖ మరిన్ని అర్బన్ పార్కుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 8093.38 హెక్టార్ల విస్తీర్ణంలో 40 ఫారెస్ట్ బ్లాకులు ఉండగా, ఇందులో 15 అర్బన్ పార్కులు ఉన్నాయి. కాగా, మరో రెండు అర్బన్ పార్కులను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని యాద్గార్పల్లిలో 547.30, గౌడవెల్లిలో 15 ఎకరాల విస్తీర్ణంలో అర్బన్ పార్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో పచ్చదనాన్ని మెరుగుపరిచే విధంగా ఎప్పటికప్పుడు అర్బన్ పార్కులను దట్టమైన అటవీ ప్రాంతాలుగా తీర్చి దిద్దుతున్నారు. అర్బన్ పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం అవసరమైన నిధులను మంజూరు చేసినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో ఇప్పటికే భాగ్యనగరం నందనవనం(నారాపల్లి), జటాయువు (మేడిపల్లి), శాంతివనం (మేడిపల్లి), ప్రశాంతివనం (దూలపల్లి), ఆక్సిజోన్(దూలపల్లి), అయూష్ వనం (బాహుదూర్పల్లి), అక్సిజన్ పార్కు(కండ్లకోయ), ఆరోగ్యవనం(ఉప్పర్పల్లి), ప్రాణ వాయు పార్కు (గాజుల రామారం), కీసర పార్కు (కీసర), తుర్కపల్లి (తుర్కపల్లి), కొండ గొర్రె పార్కు (లాల్గడి మలక్పేట్), వెదురు వనం (తూకుంట), యల్లంపేట (యల్లంపేట్)లో 15 అర్బన్ పార్కులు ఉన్నాయి. మరో రెండు అర్బన్ పార్కులు పూర్తయితే మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 17 అర్బన్ పార్కులు ఏర్పాటు కానున్నాయి.
భూ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు..
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న అటవీ శాఖ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఒక పక్క అర్బన్ పార్కుల పేరిట దట్టమైన అటవీ ప్రాంతంగా సృష్టిస్తూనే మరో పక్క అటవీ భూములను రక్షిస్తున్నారు. అటవీ భూములను ఆక్రమణుల నుంచి రక్షించడానికి గొలుసు లింక్ ఫెన్సింగ్ను చుట్టూ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించి, కొన్ని చోట్ల ఇప్పటికే ఫెన్సింగ్ పనులను ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అటవీ భూముల చుట్టూ ఫెన్సింగ్ను పూర్తి చేసేలా రూపొందించిన ప్రణాళికను అటవీ శాఖ అధికారులు అమలు చేస్తున్నారు. అలాగే, అటవీ ప్రాంతాలలో అటవీ శాఖ ప్రతి ఏడాది డ్రోన్ల ద్వారా సీడ్బాల్స్ను వేస్తూ మరింత పచ్చదనం పెంపునకు చర్యలు తీసుకుంటుంది. దీంతో పాటు అర్బన్ పార్కులలో నాటిన మొక్కలను ప్రత్యేకంగా పర్యవేక్షించేలా రక్షణ పరిశీలకులను నియమించింది. అర్బన్ పార్కులను పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అనేక నిధులను వెచ్చిస్తున్నది. హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన మేడ్చల్ జిల్లాలో ఉన్న అర్బన్ పార్కులు నగర ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.