సిటీబ్యూరో, మే 6 (నమస్తే తెలంగాణ): సేఫ్ సిటీ ప్రాజెక్ట్లో భాగంగా మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో చేపడుతున్న సీసీటీవీల నెట్వర్క్ కనెక్షన్లు, ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్లు, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్, పెలికాన్స్ సిగ్నల్స్, అవుట్రీచ్ వెహికిల్స్, భరోసా కేంద్రాలు, మొబైల్ షీ టాయిలెట్స్ వంటి ప్రాజెక్ట్లను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సేఫ్ సిటీ ప్రాజెక్ట్ నోడల్ అధికారి, నగర పోలీస్ కమిషనర్ సీవీ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం బంజారాహిల్స్లోని నూతన పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు డీజీ(ఉమెన్ సేఫ్టీ) షికాగోయల్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, రాచకొండ సీపీ డీఎస్.చౌహాన్లతో కలిసి సీపీ సీవీ.ఆనంద్ సేఫ్ సిటీ ప్రాజెక్ట్పై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా 26 సీడీఈడబ్ల్యూ (సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్)కేంద్రాల ఏర్పాటు ఈనెలాఖరు వరకు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. సీసీటీవీలకు సంబంధించిన కనెక్టివిటీ సమస్యలను పరిష్కరించడం, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లకు అవసరమైన కొత్త పరికరాలను కొనుగోలు చేసి వాటిని ఆగస్టులోపు ఏర్పాటు చేయాలన్నారు. డయల్ 100కాల్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రధానంగా ఆపదలో ఉన్న మహిళలు, చిన్నపిల్లల నుంచి వచ్చే కాల్స్ వచ్చినప్పుడు పెలికాన్ సిగ్నల్స్ను ఆపరేట్ చేయడానికి వాలంటీర్లకు అవసరమైన శిక్షణ ఇవ్వాలని, అనుభవజ్ఞులను ఏర్పాటు చేయాలని సూచించారు.
బరోసా కేంద్రాలకు సంబంధించిన భవనాల ఏర్పాటుపై సైతం ఆయన సమీక్షించారు. నగరంలోని రద్దీ ప్రాంతాల్లో షీ-మొబైల్ టాయిలెట్స్ను ఏర్పాటు చేయడమే కాకుండా వాటి లొకేషన్లను, నిర్వహణ, తదితర అంశాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించాలన్నారు. పరిపాలనా పరమైన అంశాలపై సైతం సమీక్షించారు. ఈ సమావేశంలో అదనపు సీపీ (క్రైమ్స్) ఏ.ఆర్.శ్రీనివాస్, అదనపు సీపీ (ట్రాఫిక్) జి.సుధీర్బాబు, ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.