బన్సీలాల్పేట్, ఏప్రిల్ 20 : అన్నం తింటే ముద్ద గొంతులో నుంచి కిందకు దిగదు. అన్నవాహిక కండరాలు బిగుతుగా మారి ఇబ్బంది పెడుతుంటుంది. ‘అక్లేసియా కార్డియా’ అనే ఇలాంటి సమస్యలు ఉన్న ఇద్దరు రోగులకు సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానలో గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం వైద్యులు విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ పాతబస్తీ యాకుత్పురాకు చెందిన బిల్కిస్ ఫాతిమా (30), ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన హేమలత (25)అన్నవాహికలో ఇబ్బంది తలెత్తడంతో గాంధీ దవాఖానలో చేరారు. సాధారణంగా ఇలాంటి సమస్యతో వచ్చేవారికి సర్జరీ విభాగంలో ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. రోగి వారం రోజులు దవాఖానలో ఉండాలి. అందుకు భిన్నంగా పేదల ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతన ఇచ్చే తెలంగాణ ప్రభుత్వం ఇటీవల అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన రూ.కోటిన్నర విలువైన రెండు ‘190 స్కోప్స్’ అనే కంప్యూటరైజ్డ్ ఎండోస్కోపి యంత్రాలను గాంధీ దవాఖానకు సమకూర్చింది. గురువారం వాటిని వినియోగించి ప్రొఫెసర్ పి.శ్రావణ్కుమార్ పర్యవేక్షణలో ఆపరేషన్ నిర్వహించారు. కాగా, కిమ్స్ దవాఖానకు చెందిన గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యుడు డాక్టర్ శ్రీకాంత్, సామాజిక సేవాభావంతో వారంలో రెండు రోజులు గాంధీ దవాఖానలో ‘190 స్కోప్స్’ అనే కంప్యూటరైజ్డ్ ఎండోస్కోపి యంత్రంపై ఆపరేషన్ ప్రొసీజర్ గురించి శిక్షణ ఇస్తున్నారని డాక్టర్ శ్రావణ్ కుమార్ తెలిపారు. ఈ ఆపరేషన్కు ప్రైవేట్ దవాఖానాలలో సుమారు లక్షా యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుందని, అలాంటిది గాంధీలో ఉచితంగా పేద ప్రజలకు చేస్తున్నామని ఆయన తెలిపారు.
రూ.కోటిన్నర విలువైన రెండు ‘190 స్కోప్స్’ అనే కంప్యూటరైజ్డ్ ఎండోస్కోపి యంత్రాలను ప్రభుత్వం గాంధీ దవాఖానలో సమకూర్చింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ యంత్రాలు ఇప్పటి వరకు కేవలం కార్పొరేట్ దవాఖానాల్లో మాత్రమే ఉన్నాయి. గాంధీ దవాఖానలో తొలిసారిగా ఈ యంత్రం వినియోగించి, విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించిన గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం వైద్యులకు అభినందనలు.
సర్కారు దవాఖానల్లో లభిస్తున్న వైద్య సేవలపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగిందని గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు అన్నారు. సూపరింటెండెంట్గా మూడేండ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. 1987లో గాంధీ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ విద్య కోసం అడుగుపెట్టిన తాను ఇక్కడే డాక్టర్గా, సహాయ, అసోసియేట్, ప్రొఫెసర్గా, జనరల్ మెడిసిన్ విభాగం హెచ్ఓడీగా పనిచేశానని చెప్పారు. కరోనా ప్రబలిన కీలక సమయంలో 2020 ఏప్రిల్ 21న సూపరింటెండెంట్గా భాధ్యతలను చేపట్టానని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక కరోనా రోగులకు వైద్య సేవలు అందించిన ఏకైక సర్కారు దవాఖానగా గాంధీ హాస్పిటల్ రికార్డు సృష్టించిందన్నారు. 46 వేల టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్లు కలిగి, 2000 బెడ్లు, 650 ఆక్సిజన్ వెంటిలేటర్లు కలిగి ఉన్న గాంధీలో రెండు వేల మంది కరోనా సోకిన గర్భిణిలకు సురక్షిత ప్రసవాలు చేశామని వివరాలను వెల్లడించారు. కరోనా బారిన పడిన 8 వేల మంది కిడ్నీ బాధితులకు డయాలసిస్ చేశామన్నారు. పేదల వైద్యానికి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు అందిస్తున ప్రోత్సాహం మరచిపోలేనిన్నారు.
-గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు