బంజారాహిల్స్, మార్చి 12 : ఆన్లైన్లో ఆర్డర్ చేసిన వస్తువులకు బదులుగా నకిలీ వస్తువులు పంపించి ఈఎస్ఐ వైద్యుడిని బురిడీ కొట్టించారు. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బంజారాహిల్స్ రోడ్ నం 2లోని జవహర్ కాలనీలో నివాసం ఉంటున్న ఎస్.అరవింద్ ప్రసాద్ నాయక్ ఎర్రగడ్డలోని ఈఎస్ఐసీ మెడికల్ కళాశాలలో వైద్యుడిగా పని చేస్తున్నారు. ఈ నెల 3న ఆన్లైన్లో తనకు అవసరమైన వైద్య పరికరాలను ఆర్డర్ చేశారు. దీని కోసం రూ.39,500 పంపించాడు. అయితే రెండు రోజుల తర్వాత తనకు వచ్చిన పార్సిల్లో నకిలీ పరికరాలు ఉండడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేపట్టారు.
కొరియర్లో పార్సిల్ వచ్చిందని…
కొరియర్లో పార్సిల్ వచ్చిందని నమ్మించి సైబర్ నేరగాళ్లు ఫ్యాషన్ డిజైనర్ అకౌంట్ నుంచి డబ్బులు కాజేశారు. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్లోని అర్చిత నారాయణమ్ పేరుతో ఉన్న డిజైనర్ షోరూమ్లో ఫ్యాషన్ డిజైనర్గా పని చేస్తున్న జైస్వా పౌల్కు నెల రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్కాల్ వచ్చింది. మీ సంస్థ పేరుతో కొరియర్లో పార్సిల్ వచ్చిందని, దానిని తీసుకునేందుకు తాము పంపించిన లింక్ను క్లిక్ చేయాలని సూచించాడు. లింక్ను క్లిక్ చేయడంతో ఆమె అకౌంట్లో నుంచి రూ.98,555 మాయమయ్యాయి. ఈ విషయాన్ని బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆదివారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేపట్టారు.
పాన్కార్డు అనుసంధానం పేరుతో…
పాన్కార్డు నెంబర్ను నెట్బ్యాంకింగ్కు అనుసంధానం చేసుకోకపోతే అకౌంట్ బ్లాక్ అవుతుందని నమ్మించి సైబర్ నేరగాళ్లు డబ్బులు కాజేశారు. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నం 3లోని గ్రీన్ వ్యాలీ కాలనీలో నివాసం ఉంటున్న కే.చంద్రకు 10 రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్కాల్ వచ్చింది. నెట్బ్యాంకింగ్ సేవలు కొనసాగాలంటే పాన్ కార్డు నంబర్ అప్డేట్ చేసుకోవాలని, తాము పంపిన లింక్ను ఓపెన్ చేసి బ్యాంక్ వివరాలు నమోదు చేయాలని సూచించాడు. అతడు చెప్పిన విధంగా బ్యాంక్ అకౌంట్ వివరాలు, పాన్ కార్డు వివరాలు ఎంటర్ చేయడంతో అకౌంట్ నుంచి రూ.46,937 డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. దాంతో తాను సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు ఆదివారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేపట్టారు.