జూబ్లీహిల్స్, నవంబర్16: సామాజిక భద్రత లక్ష్యంగా అసంఘటిత రంగ కార్మికులకు ఈ-శ్రమ్ పోర్టల్లో చేపడుతున్న ఉచిత నమోదును సద్వినియోగం చేసుకోవాలని యూసుఫ్గూడ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ప్రమీల సూచించారు. కార్మికుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఏ పథకానికి దరఖాస్తు చేసుకోవాలన్నా యూనివర్సల్ ఐడెంటిఫికేషన్తో 12 అంకెలు గల ఈ-శ్రమ్ గుర్తింపు కార్డు ఉండాలని సూచించారు. మంగళవారం యూసుఫ్గూడ బస్తీలో వివిధ రంగాల కార్మికులకు ఈ-శ్రమ్ పోర్టల్లో ఉచిత నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏఎల్వో ప్రమీల మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన నెలరోజుల వ్యవధిలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వందలాది మంది కార్మికులను ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేశామన్నారు. ఈ-శ్రమ్ కార్డు ఉన్న కార్మికులకే ప్రభుత్వం అందించే భద్రత, సంక్షేమ పథకాలు వర్తిస్తాయని చెప్పారు. ఉచిత నమోదును సద్వినియోగం చేసుకున్న వారికి ఏడాదిపాటు రూ. 2 లక్షల విలువైన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కల్పించనున్నట్లు తెలిపారు. 16 నుంచి 59 ఏండ్ల వయసున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అసంఘటిత కార్మిక రంగాల్లో పనిచేస్తూ ఈపీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలు లేనివారు ఈ పథకంలో దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా పరిగణిస్తారన్నారు. ఆధార్ కార్డుతో అనుసంధానమైన ఫోన్ నంబర్ కలిగిన వారు ఈ పోర్టల్లో నమోదుచేసుకోగానే కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు.
అర్హులైన అసంఘటిత రంగ కార్మికులు..
భవన నిర్మాణ, దాని అనుబంధ రంగాల్లో పనిచేసేవారు, వ్యవసాయ దాని అనుబంధ రంగాలతో ఉపాధి పొందేవారు, ఇటుక, సున్నం బట్టీలు, కాంక్రీట్ మిక్చర్ పనులు నిర్వహించే కార్మికులు, అపెరల్ రంగంలో.. టైలరింగ్, ఎంబ్రాయిడరీ, డ్రెస్ మేకింగ్, ఆటోమొబైల్ రంగంలో.. రవాణా రంగంలో డ్రైవర్లు, హెల్పర్లు, చేతివృత్తుల విభాగంలో.. చేనేత, కమ్మరి, స్వర్ణకారులు, కుమ్మరి, క్షౌరవృత్తిలో ఉన్నవారు, బ్యూటీ పార్లర్లలో పనిచేసే వారు, చర్మకారులు, రజకులు.. స్వయం ఉపాధి రంగంలో వీధి వ్యాపారులు, తోపుడు బండి వ్యాపారులు, ఇళ్లవద్ద వస్తువులు తయారుచేసే వారు, చిరు వ్యాపారులు, కల్లుగీత కార్మికులు, హస్తకళాకారులు, రిక్షా కార్మికులు, బీడీ కార్మికులు, చెత్త సేకరించేవారు.. సేవారంగంలో.. ఇండ్లల్లో పనులు చేసే వారు, కొరియర్ బాయ్స్, ఇంటివద్ద రోగులకు సేవలందించేవారు, కమీషన్ మీద వస్తువులు సరఫరా చేసే వారు.. ప్రభుత్వ పథకాలు అమలుచేసే వారిలో.. విద్యా వలంటీర్లు, ఎన్ఆర్ఈజీ, ఆశవర్కర్లు, స్వయం సహాయక సంఘాలు, అంగన్వాడీలు, మధ్యాహ్న భోజన వర్కర్లు, హమాలీలు, లోడింగ్ అన్ లోడింగ్ వర్కర్లు, దుకాణాలలో పనిచేసే వారు.. ఆహార పరిశ్రమ , బేకరీ, పాల ఉత్పత్తులు, ఫాస్ట్ ఫుడ్ తయారీ దారులు, కార్మికులు అర్హులని తెలిపారు.