సిటీబ్యూరో/ మల్కాజిగిరి, జూలై 3 (నమస్తే తెలంగాణ): ట్రై కార్పొరేషన్లో కీలకమైన ఇంజినీరింగ్ విభాగంలో నాథుడు లేని చందంగా మారింది. ఇంజనే లేకపోతే బండి ఎలా ఆగిపోతుందో..ప్రస్తుతం ఈ శాఖ పరిస్థితి అలాగే తయారైనది. ముఖ్యమంత్రి పర్యవేక్షణలోనే ఉన్న ఈ విభాగంలో పాలన పూర్తిగా గాడి తప్పిందని అనడానికి గడిచిన నెల రోజులుగా జరుగుతున్న బదిలీలే ఇందుకు నిదర్శనం.
ఒకవైపు అదనపు బాధ్యతల భారం, మరోవైపు దక్కని పదోన్నతులు..ఇంకోవైపు నెల రోజులుగా సాగుతున్న రాజకీయ బదిలీల బంతాటలో క్షేత్రస్థాయిలో ఇంజినీరింగ్ వ్యవస్థ కుప్పకూలి..ఈ ప్రభావం అభివృద్ధి పనులపై తీవ్ర ప్రభావం పడుతున్నది. పనిచేస్తున్న అరకొర ఇంజినీర్లకు అదనపు బాధ్యతలు అప్పగించడంతో వారు తీవ్ర ఒత్తిడికి లోనవుతుండడం, సంవత్సరాలుగా ఒకే పోస్టులో మగ్గుతున్న అర్హులైన అధికారులకు పదోన్నతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలం చెందింది.
సీనియారిటీ జాబితాల గందరగోళం, కాలయాపన ధోరణితో అధికారుల్లో నైరాశ్యం ఆవరించింది. ప్రజలకు అందాల్సిన అభివృద్ధి ఫలాలు అందకుండా పోతున్నాయి. జీహెచ్ఎంసీ విభజన, శివారు ప్రాంతాల విలీనంతో హడావిడిగా కొత్త జోన్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం… దానికి సరిపడా సిబ్బందిని, అధికారులను కేటాయించడంలో పూర్తిగా విఫలమైనది. ఇక క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించాల్సిన ఏఈల పోస్టులు ఏకంగా 75 శాతానికి పైగా ఖాళీగా ఉన్నాయి.
దాదాపు 80 శాతం సరిళ్లకు పూర్తిస్థాయి ఈఈలు లేరు. అంతా ఇన్చార్జ్ల భరోసాతోనే నడుస్తోంది. నాగోల్లో 5 డివిజన్లకు ఒక్కడే ఏఈ ఉన్నారు. ఎల్బీనగర్ సర్కిల్లో 5 డివిజన్లకు ఇద్దరు ఏఈలు ఉన్నారు. సరూర్నగర్ సర్కిల్లో 7 మంది ఉండాల్సి ఉండగా 4 ఏఈలు పనిచేస్తున్నారు. హయత్నగర్లో ఆరు డివిజన్లకు ఒక్కరే ఏఈ పనిచేస్తున్నారు. కాప్రా, నాచారం సరిల్స్లో 10 మంది ఏఈలకు 5 గురే పనిచేస్తున్నారు. మల్కాజిగిరి, మౌలాలి సర్కిల్లో 9 మంది డివిజన్లకు ఇద్దరే పనిచేస్తుండగా, ఇందులో ఒకరు లాంగ్ లీవ్లో ఉన్నారు. అల్వాల్ సర్కిల్లో ఆరు డివిజన్లకు ముగ్గురే ఏఈలు విధులు నిర్వహిస్తున్నారు.