సిటీబ్యూరో, జూలై 10 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్రోడ్డుపై ప్రజాభద్రతను మెరుగుపరచడంతోపాటు రోడ్డు ప్రమాదాల నివారణకు అధికార యంత్రాంగం కీలక సమావేశం నిర్వహించింది. శుక్రవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అధ్యక్షతన టీజీఐసీసీసీలో జరిగిన ఈ సమావేశంలో గత మే నెలలో ఓఆర్ఆర్పై జరిగిన సమన్వయ సమావేశంలో చర్చించిన అంశాల పురోగతిపై సమీక్షించారు. ఇందులో భాగంగా రహదారి భద్రతపై తీసుకుంటున్న చర్యలను అధికారులు వివరించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ ఓఆర్ఆర్పై ప్రమాదాలను అరికట్టేందుకు 80 క్రిటికల్ స్పాట్స్ గుర్తించామని వీటిలో ఇప్పటికే కొన్ని చోట్ల ఎన్ఫోర్స్మెంట్ పటిష్టం చేసినట్లు తెలిపారు. ఈ అత్యాధునిక సాంకేతికత ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనలను సులభంగా గుర్తించి చర్యలు తీసుకోవచ్చన్నారు.
ఓఆర్ఆర్పై దాదాపు 99శాతం వాహనాలు తరచుగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని చెప్పారు. హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ ఓఆర్ఆర్పై ప్రయాణికుల రక్షణే పరమావధిగా హెచ్ఎండీఏ తరపున అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఈ కీలక సమావేశంలో హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ రోహిత్ గోపిడి, హైదరాబాద్ అదనపు సీపీ తఫ్సీర్ ఇక్బాల్, ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్, సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ సన్ప్రీత్సింగ్, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్, ఐఆర్బీ సీనియర్జనరల్ మేనేజర్ చాంద్బాషా, ఎన్హెచ్ హైదరాబాద్ ఈఈ శ్రవణ్ప్రకాశ్, ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ హెడ్ గిరిశ్వర్, మల్కాజిగిరి డీసీపీ శ్రీఇనివాసులు తదితరులు పాల్గొన్నారు.
డిజిటల్ నెట్వర్క్ల ద్వారా సాగుతున్న సైబర్ నేరాలకు ప్రధాన వనరులుగా మారిన మ్యూల్ఖాతాలు, ఘోస్ట్ సిమ్లను సమూలంగా నిర్మూలించాలని హైదరాబాద్ సిటీపోలీస్ కమిషనర్ సజ్జనార్ పిలుపునిచ్చారు. ఇందుకోసం బ్యాంకులు, టెలికాం ఆపరేటర్లు, నియంత్రణ సంస్థలు, పోలీసు విభాగాలు సమన్వయంతో కదలాల్సిన అవసరం ఉందన్నారు. ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, హైదరాబాద్ సిటీపోలీస్, ప్రొటివిటీ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో డిజిటల్ ట్రస్ట్ అండ్ సిటిజన్ ప్రొటెక్షన్ అనే అంశంపై శుక్రవారం హైదరాబాద్ రెడ్హిల్స్లోని ఫెడరేషన్ హౌస్లో జాతీయ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎఫ్టీసీసీఐ సీనియర్ వైస్ప్రెసిడెంట్ మహేశ్వరి, శ్రీనివాస్ గరిమెళ్ల, ప్రొటివిటి ఇండియా ఎండీ సాయంతన్ బోస్, డైరెక్టర్ సంగీత, సైబర్ నిపుణులు కృష్ణశాస్త్రి పెండ్యాల, ఎయిర్టెల్ లీగల్హెడ్ ప్రదీప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.