బంజారాహిల్స్,ఏప్రిల్ 21: జూబ్లీహిల్స్లోని నవనిర్మాణ నగర్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలంపై కొందరు అక్రమార్కుల కన్ను పడింది. ఆ స్థలానికి గేటు ఏర్పాటు చేయడంతో పాటు లోనికి ఎవ్వరి వెళ్లకుండా కాపలా ఉంచారు. షేక్పేట మండల పరిధిలోని సర్వే నెంబర్ 403లోకి వచ్చే జూబ్లీహిల్స్ రోడ్ నెం 1 ప్రధాన రహదారిలోని డీఈ షా సంస్థ భవనం వెనకాల సుమారు 300 గజాల ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉంది.
ఈ స్థలానికి ఒకవైపు జూబ్లీహిల్స్ సొసైటీకి చెందిన స్థలంలో ఏర్పాటైన భారతీయ విద్యాభవన్ స్కూల్ ఉండగా మరోవైపున నవనిర్మాణనగర్ కాలనీ ఉంటుంది. అయితే ఈ స్థలంలోకి వెళ్లడానికి నవ నిర్మాణనగర్లోనుంచి మాత్రమే రోడ్డు ఉంది. నవ నిర్మాణ్నగర్లోని జీహెచ్ఎంసీ ట్రీపార్కును ఆనుకుని ఉన్న ఈ స్థలం గురించి అక్కడి వారికి తప్ప బయటి వారికి తెలియదు.
కాగా కొంతమంది పేదలు సుమారు మూడేళ్లుగా ఆ ఖాళీ స్థలంలో గుడిసెలు వేసుకుని నివాసముంటున్నారు. ఇటీవల కాలనీకి చెందిన కొంతమంది పెద్దలు వారిని ఖాళీ చేయించి ఈ స్థలం కాలనీకి చెందినదని దబాయించారు. దీంతో వారంతా అక్కడి నుంచి రెవెన్యూ ఆఫీస్కు వెళ్లగా సంబంధిత స్థలం ప్రభుత్వానిదే అని తేలింది. వారంరోజుల నుంచి స్థలాన్ని కాపాడుతున్నామనే ప్రచారంతో కాలనీకి చెందిన కొంతమంది గేటు ఏర్పాటు చేశారు. లోనికి ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఆ స్థలాన్ని క్రీడా మైదానంగా మార్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నవ నిర్మాణ్నగర్ సొసైటీకి సంబంధం లేని ఈ ప్రభుత్వ స్థలాన్ని కాలనీవాసులు ఎలా కలుపుకుంటారని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఈ స్థలంలో రెవెన్యూశాఖ అధికారులు వెంటనే ప్రభుత్వ హెచ్చరికబోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కాలనీలో గ్రీన్ బెల్ట్, ఓపెన్ స్థలాలుగా లే అవుట్లో చూపించి కొన్ని స్థలాలను ప్లాట్లుగా మార్చుకుని అమ్ముకున్నారని ఆరోపణలు ఉన్నాయి.