ఘట్కేసర్, ఆగస్టు 30 : రాష్ట్రంలో కులవృత్తులకు సీఎం కేసీఆర్ చేయూత అందిస్తున్నారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఘట్కేసర్లోని మైసమ్మ గుట్ట వద్ద నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర వడ్డెర సంఘం ఉపాధ్యక్షుడు శివరాత్రి వెంకటేశ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకుడు భద్రారెడ్డి, మంత్రి సమక్షంలో 500 మంది వడ్డెర కులస్తులు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ… సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి బీజేపీ,కాంగ్రెస్ల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు.
పలు సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం దళితులకు దళితబంధు, బీసీలకు బీసీ బంధు, మైనార్టీలకు రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేస్తున్నదని వివరించారు. దేశంలోనే రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ నంబర్ 1గా తయారు చేశారని, అన్ని రాష్ర్టాలు తెలంగాణను అభివృద్ధిలో మోడల్గా తీసుకుంటున్నాయని తెలిపారు. అంతకుముందు ఘట్కేసర్, పోచారం మున్సిపాలిటీలు, పలు గ్రామాల వడ్డెర కులస్తులు పటాకులు కాలుస్తూ, భారీ ర్యాలీగా వచ్చి బీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ చైర్పర్సన్ పావనీ జంగయ్య యాదవ్, బీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ మాధవ రెడ్డి, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు రమేశ్, కౌన్సిలర్ ఆంజనేయులు గౌడ్, వడ్డెర సంఘం ప్రతినిధులు శంకర్, ప్రసాద్, తిమ్మయ్య, గురువయ్య, శ్రీరాములు, జ్యోతి,తదితరులు పాల్గొన్నారు.
వడ్డెరుల సమస్యల పరిష్కారానికి కృషి..
నియోజకవర్గంలోని వడ్డెర కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. తమ జీవనోపాధికి గుట్టరాళ్లు ఉన్న స్థలాలను చూపాలని, వడ్డెర బంధు ఇవ్వాలని సంఘం ప్రతినిధి శివరాత్రి వెంకటేశ్ మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇందుకు స్పందించిన మంత్రి త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.