సిటీబ్యూరో, మార్చి 16 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీలో ఉద్యోగుల భద్రతకు భరోసా కల్పించడంలో యంత్రాంగం విఫలమైంది. సంస్థలో పనిచేసే ఉద్యోగుల హెల్త్ ఇన్సూరెన్స్ గడువు ముగిసి నెల రోజులు కావొస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇన్సూరెన్స్ లేకపోవడంతో అనారోగ్యం పాలవుతున్న ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ఓ శానిటేషన్ జవాన్కు గుండెపోటు రావడంతో స్థానిక హాస్పిటల్కి తరలించారు. 5 లక్షలు అవుతుందని హాస్పిటల్ యాజమాన్యం తేల్చి చెప్పడంతో డబ్బులు కట్టలేక, ఇన్సూరెన్స్ లేకపోవడంతో ఏం చేయాలో తెలియక ఆ కుటుంబం పడిన బాధలు అన్నీ ఇన్నీ కావు.
గడిచిన నెల రోజులుగా వివిధ కారణాలతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న మిగతా ఉద్యోగుల పరిస్థితి ఇలాగే ఉందని, సంబంధిత అధికారులు పట్టించుకుని హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో సరైన నిర్ణయం తీసుకుని కొత్త సంస్థకు ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. వాస్తవంగా బజాజ్ హెల్త్ ఇన్సూరెన్స్ గడువు గత ఫిబ్రవరి 14తో ముగిసింది. జీహెచ్ఎంసీ నుంచి ప్రీమియం కట్టకపోవడంతో రెన్యువల్ కాలేదు. కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ టెండర్లను పిలుస్తామని చెబుతున్నారే తప్ప..ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. అధికారుల కాలయాపనతో అనార్యోగానికి గురవుతున్న ఉద్యోగులకు హాస్పిటల్స్లో డబ్బులు కట్టలేక, వైద్యం చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
2019 నుంచి జీహెచ్ఎంసీలో పనిచేసే ఉద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించారు. ఉద్యోగులకు అప్పటి కమిషనర్ లోకేశ్కుమార్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చారు. మొదట 3 లక్షల వరకు ఆ తర్వాత 5 లక్షల వరకు కవర్ అయ్యేలా చేశారు. ప్రస్తుతం బజాజ్ హెల్త్ ఇన్సూరెన్స్ సరిగా పనిచేయడం లేదని, కొన్ని హాస్పిటల్స్ అంగీకరించడం లేదని ఉద్యోగులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
ఇటీవల శానిటేషన్ జవాన్కు హార్ట్ ఎటాక్ రావడంతో ఖైరతాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. నాలుగు స్టంట్స్ వేయాలని, ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుందని హాస్పిటల్ వర్గాలు శానిటేషన్ జవాన్ ఫ్యామిలీకి తెలిపారు. తమకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందని హాస్పిటల్ వారికి ఇస్తే.. ఇది ఎక్స్ పైర్ అయింది కాబట్టి చెల్లదు.. మొత్తం డబ్బులు కడితేనే చికిత్స చేస్తామని చెప్పారున. దీంతో ఏం చేయాలో తెలియక అప్పు చేసి ఇబ్బందులు పడిన పరిస్థితి. మరికొందరు ఉద్యోగులు వివిధ అనారోగ్య సమస్యలపై ఆసుపత్రి పాలయ్యారు. ఇలా వరుసగా కమిషనర్, అడ్మిన్ అడిషనల్ కమిషనర్ని కలిసి విన్నవించినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు.