హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): కేబీఆర్ పార్క్లో తమకు ఎదురైన అనుభవాన్ని వివరిస్తూ.. ఒక మాతృమూర్తి రాసిన లేఖ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు హృదయాన్ని కదిలించింది. హైదరాబాద్ కేబీఆర్ పార్కులోని నెమళ్లను చూసి తమ ఐదేండ్ల బాలుడు ఎంతగానో పరవశించి పోయాడని ఆమె లేఖలో తెలిపారు. సంతోషంతో, ఉత్సాహంగా కేరింతలు కొట్టాడని రాశారు. అక్కడ పడి ఉన్న నాలుగు నెమలి ఈకలను పట్టుకొని బయటకు వస్తుంటే.. గేటు వద్ద పార్క్ సిబ్బంది వాటిని లాగేసుకొన్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
నెమలి జాతీయ పక్షి, దానిని చంపడం, వేటాడం నేరమంటూ అక్కడ రాసి ఉన్న బోర్డును చూపించారని పేర్కొన్నారు. తన బాబుతో పాటు మరికొందరు పిల్లలకు అదే రకమైన అనుభవం ఎదురైందని వివరించారు. ఇవేమీ తెలియని ఆ పసివాడు తీవ్ర నిరాశకు గురయ్యాడని ఆవేదన వ్యక్తంచేశారు. జాతీయ విద్యావిధానం-2020 ప్రకారం చదవడమే కాకుండా ప్రయోగాత్మక అభ్యాసం ఉండాలని సూచిస్తున్నదని గుర్తుచేశారు. కానీ, ఇక్కడ మాత్రం కింద పడిపోయిన ఈకలను కూడా తీసుకోవడానికి అనుమతించడంలేదని, దీనిపై అటవీశాఖ అధికారులకు సూచన చేయాలని కోరారు. ఈ లేఖపై కేటీఆర్ స్పందిస్తూ.. ఆ తల్లి ఆవేదన హృదయాన్ని హత్తుకునే విధంగా ఉన్నదని ట్వీట్ చేశారు. కింద పడిపోయిన నెమలి ఈకలను తీసుకెళ్లడానికి పిల్లలను మాత్రమే అనుమతించాలని కేబీఆర్ పార్కు అధికారులను కోరారు. జాతీయ పక్షి కావడంతో నిబంధనలు కఠినంగా ఉంటాయని, అయితే పిల్లలకు ఈ విషయంలో మినహాయింపు ఇవ్వాలని సూచించారు.