సిటీబ్యూరో, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : అంతరాయం లేని విద్యుత్ సరఫరా లక్ష్యంగా పనిచేస్తున్న విద్యుత్ శాఖకు పిల్లి శకునంగా మారింది. మంగళవారం ఉదయం 7 గంటలకు సరూర్నగర్ సర్కిల్ పరిధిలోని నందనవనం సబ్ స్టేషన్లో ఉన్న పవర్ ట్రాన్స్ఫార్మర్ (పీటీఆర్)కు అనుసంధానమై ఉన్న పవర్ బ్రేకర్ లింబ్పై పిల్లి దూకడంతో ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
దీంతో ఆ సబ్ స్టేషన్ పరిధిలోని 12 ఫీడర్ల పరిధిలో సుమారు గంటన్నర పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు సబ్ స్టేషన్కు చేరుకొని మరమ్మతులు చేపట్టారు.