సిటీబ్యూరో, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో విద్యుత్ వినియోగం రోజురోజుకూ పెరుగుతున్నది. వారం రోజులుగా ప్రతిరోజూ వినియోగం 85 నుంచి 90 మెగా యూనిట్లతో రికార్డు స్థాయిలో డిమాం డ్ నమోదవుతున్నది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే రోజుకు సగటున 250 మెగావాట్లకు పైగా అధిక డిమాండ్ ఉంటున్నది. కరెంట్ స్టవ్లు, ఎలక్ట్రిక్ కుక్కర్ల వాడకం, ఏసీలు, ఫ్యాన్లు ఎక్కువగా వాడటం, ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరగడం వంటి కూడా విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుకోవడానికి ఒక కారణమంటూ విద్యుత్ రంగ నిపుణులు చెప్పారు.
ఇదిలా ఉంటే వేడి కారణంగా కొన్నిచోట్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయంటూ టీజీఎస్పీడీసీఎల్కు ఫిర్యాదులు వస్తున్నాయి. ఒత్తిడి కారణంగా ఫీడర్లు ట్రిప్ అవ్వడంతో కరెంట్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయని విద్యుత్ అధికారులు చెప్పారు. ఏప్రిల్ మొదటి రెండువారాల్లోనే ఈ పరిస్థితి ఉంటే రాబోయే రోజుల్లో ఈ సమస్యను ఎలా అధిగమించాలో తెలియడం లేదంటూ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 10న కరెంటు డిమాండ్తో పాటు వినియోగం ఎక్కువగా ఉండడం గమనార్హం.
పీక్ అవర్స్లో ఎక్కువ డిమాండ్..!
ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో సాయంత్రం ఆరున్నర గంటల నుంచి ఏడున్నర గంటల మధ్య విద్యుత్ డిమాండ్ 4వేల మెగావాట్లకు మించి నమోదవుతున్నదని అధికారులు చెప్పారు. ఈ క్రమంలో సంస్థ ఆపరేషన్స్ డైరెక్టర్ డా.నర్సింహులు పీక్ సమయాల్లో నగరంలోని సబ్స్టేషన్లు, కార్యాలయాలను పర్యటిస్తూ సిబ్బందిని , అధికారులను అప్రమత్తం చేస్తున్నారని, సాలార్జంగ్ సబ్స్టేషన్ను సోమవారం తనిఖీ చేసి పవర్ ట్రాన్స్ఫార్మర్ లోడ్లను సమీక్షించినట్లు అధికారులు తెలిపారు.
