Gruha Jyothi | సిటీబ్యూరో: గృహజ్యోతి పథకం లబ్ధిదారులకు బిల్లుల షాక్ తగిలింది. మార్చి నెలలో విద్యుత్ మీటర్లు గిర్రున తిరిగేశాయి. ఫలితంగా 200 యూనిట్ల లోపు ఉండాల్సిన కరెంటు వినియోగం కాస్తా 250 నుంచి 300 యూనిట్లు దాటింది. దీంతో అంతకు ముందు గృహజ్యోతి పథకానికి అర్హులుగా గుర్తించిన వారిలో సుమారు 10 లక్షల మంది ఒక్కసారిగా నిరుత్సాహానికి గురయ్యారు. మార్చి నెల నుంచి 200 యూనిట్ల లోపు విద్యుత్ను వినియోగించే వారికి ‘గృహజ్యోతి’ అమలు చేసేస్తామని ప్రకటించిన తర్వాత రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. మరోవైపు మార్చి నెలలో విపరీతమైన ఎండల కారణంగా విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో పెరిగింది. ఫలితంగా 200 యూనిట్లలోపు రావాల్సిన కరెంటు బిల్లులు ఒక్కసారిగా మోతమోగడంతో గృహజ్యోతి లబ్ధిదారులు నిరాశచెందారు.
టీఎస్ఎస్పీడీసీఎల్ పరిధిలో మొత్తం 21 సర్కిళ్లు ఉండగా, అందులో సుమారు 36 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. వీరందరికీ మార్చి నుంచి ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేసేందుకు మీటర్ రీడింగ్లో 200 యూనిట్ల కంటే తక్కువ వచ్చిన వారందరికీ ఫిబ్రవరి నెలకు సంబంధించి జీరో బిల్లులు జారీ చేస్తూ వచ్చారు.అదే సమయంలో రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆయా జిల్లాల్లో జీరో బిల్లులు ఇవ్వలేదు. మార్చిలో మధ్యలోనే పార్లమెంటు ఎన్నికల కోడ్ రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. దీంతో గృహజ్యోతి అమలు ఎక్కడిది అక్కడే అన్నట్లు నిలిచిపోయింది.
ముఖ్యంగా గ్రేటర్ పరిధిలోని 9 సర్కిళ్లలో 60.80 లక్షల మంది విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. అందులో గృహజ్యోతి లబ్ధిదారులు గ్రేటర్లోనే అధికంగా ఉన్నారు. ప్రస్తుతం ఏప్రిల్ మొదటి వారంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. 2వ తేదీన 83.84 మిలియన్ రికార్డు యూనిట్లు నమోదయ్యాయి. మే నెల సైతం ఇంతకు మించి ఉండే అవకాశం ఉంటుందని.. సుమారు 90 మిలియన్ యూనిట్లు దాటుతుందని అంచనా వేశారు. ఇలా విద్యుత్ వినియోగదారులకు బిల్లులు మోత మోగుతుండగా, గృహజ్యోతి లబ్ధ్దిదారులకు ఈ మూడు నెలలు ఉచితం దక్కనట్లేనని చెప్పవచ్చు.
మొత్తం కనెక్షన్లు (21 సర్కిళ్లు) -1.13 కోట్లు
జీహెచ్ఎంసీ పరిధిలో ( 9 సర్కిళ్లు) మొత్తం విద్యుత్ కనెక్షన్లు – 60.80 లక్షలు
మొత్తం డిస్కం పరిధిలో గృహ జ్యోతి పథకం లబ్ధిదారులు సుమారు – 36 లక్షల మంది