Ganesh Chaturthi | సిటీబ్యూరో, సెప్టెంబర్ 16(నమస్తే తెలంగాణ): వినాయక చవితి పండగ నేపథ్యంలో ఏర్పాటు చేసే గణేశ్ మండపాలకు నిరంతర విద్యుత్ సరఫరా, భద్రతా పరంగా విద్యుత్ శాఖ చేపట్టిన పనులను దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జి.రఘుమారెడ్డి శనివారం సమీక్షించారు.
ఈనెల 18 నుంచి ప్రారంభమయ్యే గణేశ్ నవరాత్రి ఉత్సవాలు 11 రోజుల పాటు నిర్వహిస్తున్న నేపథ్యంలో మండపాలకు నిరంత విద్యుత్ సరఫరా, మండపాల వద్ద భద్రత విషయమై ప్రత్యేక మార్గదర్శకాలు చేసింది. స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ, పండుగను సురక్షితంగా జరుపుకోవాలని మండపాల నిర్వాహకులకు, సామాన్య ప్రజలకు సీఎండీ రఘుమారెడ్డి సూచించారు.
☞ మండపాలకు విద్యుత్ సరఫరా కనెక్షన్ కోసం సామాన్యులు స్తంభాలు ఎక్కరాదు. సంస్థ సిబ్బంది ద్వారానే విద్యుత్ కనెక్షన్ పొందాలి.
☞ ఐఎస్ఐ మార్క్ కలిగిన ప్రామాణిక విద్యుత్ వైర్లను మాత్రమే వాడాలి. ఎలాంటి జాయింట్ వైర్లు వాడరాదు.
☞ తగినంత కెపాసిటీ కలిగిన ఎంసీబీ తప్పనిసరిగా వాడాలి. ఇది విద్యుత్ ప్రమాదాల నుంచి రక్షణ ఇస్తుంది.
☞ మండపాల్లో విద్యుత్ సంబంధిత పనులు చేసేటప్పుడు పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. విద్యుత్ వైర్లు, పోల్స్, ఇతర ప్రమాదకర విద్యుత్ పరికరాల నుంచి పిల్లల్ని దూరంగా ఉంచండి.
☞ అనుకోకుండా ఎవరికైనా విద్యుత్ షాక్ తగిలితే వారికి వెంటనే వైద్య సహాయం అందించి, ఆ ప్రమాదం గురించి దగ్గరల్లోని విద్యుత్ సిబ్బందికి తెలియజేయాలి.
☞ విద్యుత్ వైరింగ్లో ఎక్కడైనా లీకేజ్ ఉంటే, వర్షాలు కురిసినప్పుడు తేమ వలన షాక్ కలిగే అవకాశమున్నది. మండప నిర్వాహకులు ప్రతి రోజు తప్పనిసరిగా వైరింగ్ను క్షుణ్ణంగా పరిశీలించాలి.
☞ విద్యుత్ లైన్స్ ఎక్కడైనా తెగి పడ్డా, ఇతర అత్యవసర పరిస్థితులు ఏర్పడిన వెంటనే 1912/100 నంబర్లకు లేదా సమీప ప్యూజ్ ఆఫ్ కాల్కు కాల్ చేసి విద్యుత్ సిబ్బంది తెలియజేయాలి.