Elections Code | నగర పరిధిలోని బాలానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో భారీగా నగదు పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా రూ.52.50లక్షల నగదు పట్టుబడింది. అయితే, సరైన పత్రాలు చూపించకపోవడంతో డబ్బును పోలీసులు సీజ్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమలులోకి వచ్చింది. షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. నాటికి రూ.518,90,13,033 స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సోమవారం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో రూ.3,21,59,725 నగదును సీజ్ చేయడంతో పాటు రూ.3,52,13,849 విలువైన మద్యం, రూ.1,76,44,810 విలువైన మత్తుపదార్థాలు పట్టుకున్నట్లు తెలిపారు. అలాగే రూ.20,91,425 విలువైన బంగారం, రూ.11,57,99,379 విలువైన చీరలు, కుక్కర్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఎన్నికల కోడ్ ప్రకారం.. ఎవరైనా రూ.50వేలకుపైగా డబ్బును తీసుకువెళ్తున్న సమయంలో అందుకు సంబంధించిన రశీదును తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. లేకపోతే తనిఖీ చేసే పోలీసులకు సీజ్ చేసే అధికారం ఉంటుంది.