సిటీబ్యూరో, మార్చి 27 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్రాస్ అధికారులను ఆదేశించారు. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్లో హైదరాబాద్, సికింద్రాబాద్ రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల విభాగం అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ… ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ అందజేయడం, పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ, నిబంధనలు, ఫెసిలిటేషన్ సెంటర్ల ఏర్పాటు తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎన్నికల కమిషన్ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించిందని తెలిపారు. ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బందికి మొదటి విడత శిక్షణ కార్యక్రమంలోనే ఫారం-12 అందించి, పోస్టల్ బ్యాలెట్పై పూర్తి అవగాహన కల్పించాలన్నారు.
ఎన్నికల విధులు నిర్వహించే వారు తమ ఎపిక్ కార్డుతో పాటు పార్ట్నంబర్, సీరియల్ నంబర్ కూడా శిక్షణ తరగతులకు హాజరయ్యే సందర్భంలో తీసుకొని వచ్చేలా మెసేజ్ పంపించాలన్నారు. ఎలక్షన్ కమిషన్ సూచించిన ఎమర్జెన్సీ సర్వీస్ శాఖలకు నోడల్ ఆఫీసర్ను నియామకం చేసేందుకు లేఖ రాయాలని, వారి వివరాలను పంపించాలని ఎలక్షన్ అడిషనల్ కమిషనర్ను ఆదేశించారు.
ఎన్నికల విధులకు ఉత్తర్వులు జారీ చేసిన వారు శిక్షణకు గైర్హాజరు అయిన పక్షంలో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెన్షన్తో పాటు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసేందుకు వెనుకాడవద్దని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సికింద్రాబాద్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడే, జీహెచ్ఎంసీ ఎన్నికల అదనపు కమిషనర్ అలివేలు మంగతాయారు, ఏఆర్ఓలు, ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 27: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పీహెచ్డీ కోర్స్ వర్క్ (ప్రీ పీహెచ్డీ) పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రీ పీహెచ్డీ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలను ఏప్రిల్ 23 నుంచి నిర్వహించనున్నారు.
ఓయూ పరిధిలోని ఐదేండ్ల బీబీఏ ఎల్ఎల్బీ, ఐదేండ్ల బీకామ్ ఎల్ఎల్బీ, మూడేండ్ల ఎల్ఎల్బీ, మూడేండ్ల ఎల్ఎల్బీ ఆనర్స్ కోర్సుల పరీక్షా ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఈ ఫలితాలను www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.