సిటీబ్యూరో, అక్టోబర్ 10(నమస్తే తెలంగాణ): ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ కోరారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, షెడ్యూల్ను అనుసరించి నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని, నవంబర్ 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరించడం జరుగుతుందని, నవంబర్ 30వ తేదీన ఎన్నికలు జరుగుతాయని, డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించడం జరుగుతుందని రొనాల్డ్ రాస్ వివరించారు. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం ఒకటి ఎస్సీ రిజర్వ్ ఉన్నదని, మిగతా 14 నియోజకవర్గాలు జనరల్ కేటగిరీలో ఉన్నాయన్నారు. జిల్లాలో ఈ నెల 4వ తేదీన ప్రచురించిన తుది ఓటరు జాబితా ప్రకారం మొత్తం 44,42,458 ఓటర్లు ఉండగా, అందులో పురుషులు 22,79,617 మంది ఉన్నారు. కాగా, మహిళలు 21,62,541, ఇతరులు 300 ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఇందులో సర్వీస్ ఓటర్లు 404, ఎన్నారై ఓటర్లు 847, దివ్యాంగులు 24,163, వృద్ధులు 80 సం. పైబడిన ఓటర్లు 83,588 ఉన్నారని పేర్కొన్నారు.
ఓటరు జాబితాలో ైక్లెయిమ్స్, అబ్జెక్షన్లపై ఎలక్షన్ నామినేషన్ చివరి రోజుకు పది రోజుల ముందు అనగా నవంబరు 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని రొనాల్డ్ రాస్ వివరించారు. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 1,688 లొకేషన్లలో 3,986 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇందులో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3,931 ఉండగా సైబరాబాద్ కమిషనరేట్లో 51, రాచకొండ కమిషనరేట్లో 4 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు 34,452 మంది పోలింగ్ స్టాఫ్, పోలీస్ పర్సనల్ ఏర్పాటు చేయడం జరిగిందని రొనాల్డ్ రాస్ తెలిపారు. ఎన్నికల్లో వినియోగించే ఈవీఎంల ఫస్ట్ లెవల్ చెకప్ పూర్తి చేసి విక్టరీ ప్లే గ్రౌండ్లో భద్రపర్చడం జరిగిందన్నారు. ఈవీఎంలపై అవగాహనకు 397 వివిధ బస్ స్టేషన్లతో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టామని, 16 ప్రదేశాలలో ఈవీఎం, వీవీ ప్యాట్లపై 15,158 మందికి అవగాహన కల్పించడం జరిగిందన్నారు. 15 మొబైల్ వ్యాన్ల ద్వారా ఈవీఎం, వీవీ ప్యాట్లపై 15 నియోజకవర్గాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించామని రొనాల్డ్ రాస్ వివరించారు.
జనరల్ కండక్ట్లో భాగంగా రాజకీయ పార్టీలు భాష, మత, కమ్యూనిటీలను దూషించే విధంగా ప్రవర్తించిన వారిపై ఆర్.పి యాక్ట్ 1951 ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ తెలిపారు. రాజకీయ పార్టీలు ఇతరులను విమర్శించే విధంగా సంభాషించకూడదని తెలిపారు. మజీద్లు, చర్చీలు, దేవాలయాల ప్రాంగణంలో ఎటువంటి ప్రచారం నిర్వహించకూడదని పేర్కొన్నారు. కులం, మతం ఆధారంగా ఓట్లు అడగకూడదని తెలిపారు. రాజకీయ పార్టీలు ఓటర్లను మభ్యపెట్టేందుకు విలువైన వస్తువులు ఇవ్వడం, ఓటర్లను బెదిరించడం, పోలింగ్ స్టేషన్లకు వంద మీటర్ల లోపు ప్రచారం నిర్వహించకూడదని చెప్పారు. పోలింగ్ తేదీకి 48 గంటల ముందు వరకు ఎటువంటి పబ్లిక్ మీటింగ్స్ నిర్వహించకూడదని తెలిపారు. ఓటర్లకు ట్రాన్స్ పోర్ట్ సౌకర్యం కల్పించకూడదని రొనాల్డ్ రాస్ చెప్పారు. ఎవరి ఇంటి వద్ద కూడా ధర్నాలు, నిరసనలు నిర్వహించకూడదని తెలిపారు.
ఏ పార్టీ కానీ బరిలో ఉన్న అభ్యర్థులు కానీ, తమ అనుచరులు కానీ ఎవరి ల్యాండ్, బిల్డింగ్, కాంపౌండ్ వాల్ వారి అనుమతి లేకుండా జెండాలు, బ్యానర్లు, పోస్టర్లు, వాల్ రైటింగ్ చేయకూడదని తెలిపారు. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులు, అనుచరుల ద్వారా వివిధ ప్రదేశాలలో నిర్వహిస్తున్న ఇతర పార్టీల సమావేశాలకు ఆటంకం కలిగించకూడదన్నారు. ఒకే ప్రదేశంలో ఇరు పార్టీలు ర్యాలీలు, పబ్లిక్ సమావేశాలు నిర్వహించకూడదని తెలిపారు. సమావేశాలు, లౌడ్ స్పీకర్లకు లౌడ్ స్పీకర్లు, ర్యాలీలు నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు లోకల్ పోలీస్ అథారిటీ ద్వారా అనుమతి పొందాలని తెలిపారు. పోలింగ్ రోజు రాజకీయ పార్టీల పోలింగ్ ఏజెంట్లకు బ్యాడ్జీలు, ఐడీ కార్డులు సరఫరా చేయాలని రొనాల్డ్ రాస్ తెలిపారు. రాజకీయ పార్టీలు ఓటర్లకు ఐడెంటి స్లిప్ను తెల్ల కాగితంలో అందించాలని, దానిపై ఎటువంటి సింబల్స్, అభ్యర్థి పేరు, పార్టీ పేరు ఉండకూడదని తెలిపారు. పోలింగ్కు రెండు రోజుల ముందు నుంచి మద్యం పంపిణీ చేయకూడదని రాజకీయ పార్టీలకు సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు క్యాంప్ నిర్వహణ ప్రదేశాలలో ఎకువ మంది ఉండకూడదన్నారు.
పోలింగ్ బూత్ వద్ద ఓటర్లు కాకుండా ఇతరులు ఎలక్షన్ కమిషన్ పాస్ లేకుండా ఉండకూడదని రొనాల్డ్ రాస్ వివరించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులు, ఏజెంట్లు ఎన్నికల నిర్వహణ పై ఫిర్యాదులను ఎన్నికల పరిశీలకులకు వివరించవచ్చని ఎన్నికల అధికారి తెలిపారు. రాజకీయ పార్టీ ప్రతినిధులు ఎన్నికల కమిషన్ సూచించిన నిబంధనలను ఉల్లఘించిన వారిపై ఆర్.పి యాక్ట్ 1951, ఐ.పి.సి సెక్షన్ 171, సెక్షన్ 127 ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. 80 ఏండ్లు పైబడిన వృద్ధులకు, దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్ 12డి అందించడానికి ముందస్తుగా దరఖాస్తు చేసుకున్న పక్షంలో పోలింగ్ సిబ్బంది నేరుగా వారి ఇంటికి వెళ్లి ఓటు వేసే వెసులుబాటును ఎన్నికల సంఘం కల్పించినదని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ తెలిపారు.
ఓటర్లకు సందేహాలు నివృత్తి చేయడానికి జీహెచ్ఎంసీలో కంట్రోల్ రూం ను ఏర్పాటు చేయడం జరిగిందని రొనాల్డ్ రాస్ తెలిపారు. ఇందులో భారత ఎన్నికల సంఘం 1950 టోల్ ఫ్రీ 1800-599-2999 అనే నంబర్ 24 గంటల పాటు పనిచేస్తుందని తెలిపారు. సీ-విజిల్ యాప్ ద్వారా మోడల్ కోడ్ లో ఉల్లంఘన జరిగిన ఫిర్యాదులను 100 నిమిషాలలోపు క్లియర్ చేసి యాప్లో ఉంచుతామని పేర్కొన్నారు. సువిధా సెంటర్ ద్వారా సింగిల్ విండో పర్మిషన్ ద్వారా పొలిటికల్ పార్టీలు, అభ్యర్థులు వినియోగించే నాన్ కమర్షియల్, రిమోటర్, అన్ కంట్రోల్ ఎయిర్ ఫోర్స్, హెలీ ప్యాడ్స్లకు అనుమతి తీసుకోవాలని, పబ్లిక్ మీటింగ్స్, ర్యాలీలు, లౌడ్ స్పీకర్స్కు అనుమతి తప్పని సరి అని రొనాల్డ్ రాస్ చెప్పారు. మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ద్వారా పెయిడ్ న్యూస్, సుృటినీ, అడ్వటైజ్మెంట్ సర్టిఫికేషన్ను సీపీఆర్వో నుంచి పొందాలని రొనాల్డ్ రాస్ తెలిపారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనుసరించి కంట్రోల్ రూంను డీఈవో కార్యాలయం, ప్రతి ఆర్ఓ ఆఫీస్లలో ఏర్పాటు చేశామని తెలిపారు.
ప్రతి నియోజకవర్గంలో ఆరు టీమ్లతో ఫ్లయింగ్ స్వాడ్లను ఏర్పాటు చేశామన్నారు. పొలిటికల్ పార్టీలు చేసే ర్యాలీలు, మీటింగ్లను వీడియోగ్రఫీ చేయడానికి 15 నియోజకవర్గాలలో 15 వీడియో సర్వీలెన్స్ టీమ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎంసీసీ ద్వారా పొలిటికల్ పార్టీలు వాహన వినియోగానికి పర్మిషన్ తీసుకోవాలన్నారు. ప్రభుత్వ స్థలాల్లో పోస్టర్లు, పెయింటింగ్స్ వేయరాదని, అనధికార ప్రకటనలపై ఎంసీసీ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పొలిటికల్ సమావేశాలలో మతపరమైన ఉపన్యాసాలు చేయకూడదని తెలిపారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో నియోజకవర్గానికి ఆరు టీమ్ల చొప్పున 90 టీమ్లను ఏర్పాటు చేశామని రొనాల్డ్ రాస్ తెలిపారు. ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్లను వీడియో తీయడానికి ఒక్కొక నియోజకవర్గానికి ఒకొక వీడియో సర్వేలెన్స్ టీంలను ఏర్పాటు చేశామని తెలిపారు.
ఎన్నికలకు ఎన్ఫోర్స్మెంట్పై విస్తృత చర్యలు చేపట్టినట్లు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. సోమవారం పెద్ద మొత్తంలో నగదు పట్టుపడినట్లు చెప్పారు. ఎన్నికలకు ఫ్లయింగ్ స్వాడ్లు, వీఎస్టీలను ఏర్పాటు చేశామని సీవీ ఆనంద్ తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అక్రమ మద్యం రవాణా, నగదు ప్రవాహంపై వేగవంతమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాజకీయ పార్టీలు ఓటర్లకు ఉచితంగా అందించే వస్తువులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. నాన్ బెయిలబుల్ వారంట్ టీమ్లు ఉన్నాయని తెలిపారు. 652 బైండోవర్లను నమోదు చేశామని తెలిపారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై పీడీ యాక్ట్, ఆర్.పి యాక్ట్ 1951 ద్వారా చర్యలు తీసుకుంటామని తెలిపారు. హైదరాబాద్ నగరంలో 1587 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టుల ద్వారా నారోటిక్స్ పై మద్యం, గంజాయి నగదు ప్రవాహం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులో జీఎస్టీ, ఐటీ, ఎక్సైజ్ కమిషనర్ టాక్స్ ఆర్టీఏ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన కస్టమ్స్, నారోటిక్ ఈడీ అధికారులతో 24 గంటల పాటు పని చేసే విధానంగా పని చేస్తున్నాయని, జిల్లాలో 18 ప్రదేశాలలో ఏర్పాట్లు చేస్తున్నట్లు సీపీ తెలిపారు. రానున్న రోజుల్లో ఇంకా కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని సీపీ స్పష్టం చేశారు. ప్రలోభాలకు తావివ్వకుండా పటిష్టమైన నిఘా ఉంటుందన్నారు.
ఈ నెల 4వ తేదీన విడుదలైన ఓటరు జాబితాలో ఏఎస్డీ (ఆబ్సెంట్, షిఫ్టిటెడ్, డిలీట్) జాబితాను అందించాలని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి నిరంజన్ కోరారు. అన్ని రాజకీయ పార్టీలను సమాన దృష్టితో చూడాలని, కొందరిపై మాత్రమే బైండోవర్లను చేయడం తగదని, పోలీసులపైన కూడా విజిలెన్స్ ఉండేలా చూడాలని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కోరగా, వాటిపై చర్యలు తీసుకుంటాని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని పలు నియోజక వర్గంలో ఎకువ శాతం ఓటర్లు పెరుగుతున్నాయని వాటి పెరుగుదలకు ఇతర జిల్లాలోని నుంచి ఓటరు నమోదు చేస్తున్నారని బీజేపీ పార్టీ ప్రతినిధి వెంకటరమణ ఎన్నికల అధికారి దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి ఎన్నికలో వేల కొద్ది ఓటర్లు పెరుగుతున్న నేపథ్యంలో పూర్తి పరిశీలన చేయాలన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం భోలక్పూర్లో ఎకువగా ఓట్లు నమోదయ్యాయని తెలుపగా వాటిపై ఎస్ఎస్ఆర్ (స్పెషల్ సమ్మరీ రివిజన్), ఫారం-7, ఫారం-8 ద్వారా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నామని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి వివరించారు.
ఓటరు స్లిప్లను రాజకీయ పార్టీల ద్వారా పంపిణీ చేయుటకు అనుమతి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి నిరంజన్ కోరగా ఎన్నికల కమిషన్ ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు రాలేదని వారు సూచించిన మేరకు మాత్రమే ఓటరు స్లిప్లను పంపిణీ చేస్తామన్నారు. నియోజకవర్గాల వారీగా ఓటర్ల సంఖ్య పెరిగిందని, డూప్లికేట్ ఓటర్లు ఎకువగా ఉన్నారని టీడీపీ ప్రతినిధి చారి తెలుపగా వాటిని పూర్తి స్థాయిలో నియంత్రించామని ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ వివరించారు. బోరబండలో కొన్ని కాలనీలలో ఎపిక్ కార్డుతో పరిశీలించగా అట్టి ఓట్లు ఇతర రాష్ట్రంలో ఉన్నట్లు చూపిస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రతినిధి కార్తీక్రెడ్డి అధికారుల దృష్టికి తెచ్చారు. కార్వాన్ నియోజకవర్గంలో తుది ఓటరు జాబితా విడుదల సందర్భంగా ఓటరు జాబితాలో పలు పోలింగ్ స్టేషన్లో ఎకువగా మిక్సింగ్ ఓటర్లు గణనీయంగా పెరిగిందని ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ మోహినుద్దీన్ తెలుపగా బీఎల్ఓలు హౌస్ టూ హౌస్ సర్వే ద్వారా ఫారం-6, 7, 8 ద్వారా తగిన చర్యలు తీసుకున్నారని ఎన్నికల అధికారి వివరించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఈవీడీఎం ప్రకాష్ రెడ్డి, అడిషనల్ కమిషనర్ శంకరయ్య, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.